23-01-2026 12:00:00 AM
చిట్యాల, జనవరి 22 : పేదలకు వరం ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం అని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. గురువారం నకిరేకల్ పట్టణంలోని సాయిబాబా ఆలయ మందిరంలో నియెజకవర్గ పరిధిలోని అన్ని మండలాలకు సంబంధించిన ముఖ్యమంత్రి సహాయ నిధి (సిఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరు అయిన 212 మంది లబ్ధిదారులకు రూ.90.87 లక్షల విలువగల చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో నియెజకవర్గంకి నేటికి రూ.18.24 కోట్ల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశామని, పేద వారికి ఆసరాగా ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం నిలుస్తుందని అన్నారు. స్థానికంగా గల 100 పడకల ఆసుపత్రిని త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామని, ట్రామా కేర్ సెంటర్, సిటీ స్కాన్ లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, ఉచ్చిత బస్సు ప్రయాణం కల్పించామని,గత ప్రభుత్వంలో ఎన్నో లక్షల కోట్లు అప్పు చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదవారి కష్టం గురించి ఆలోచన చేస్తుందని, నియెజకవర్గంలో 3500 ఇండ్లు కేటాయించామని, మార్చిలో ఇండ్లు ఇస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందజేయబడిన నగదును లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు పున్న కైలాష్ నేత, స్థానిక మున్సిపాలిటీ మాజీ చైర్మన్ చెవుగోని రజిత - శ్రీనివాస్, మార్కెట్ చైర్మన్ లు గుత్తా మంజుల-మాధవ్ రెడ్డి, నర్రా వినోద - మోహన్ రెడ్డి, నియోజకవర్గంలోని అన్ని మండలాల అధ్యక్షులు, స్థానిక కౌన్సిలర్లు, సర్పంచులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.