calender_icon.png 10 May, 2025 | 5:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూ భారతి 1443 దరఖాస్తుల పరిష్కారం: కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

09-05-2025 08:53:07 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో భూభారతి పథకం కింద వచ్చిన దరఖాస్తుల్లో 1443 దరఖాస్తులు పరిష్కరించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ తెలిపారు. భూ భారతి చట్టం ప్రకారం వచ్చిన అర్జీలను చట్ట ప్రకారం పరిశీలించి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు.  శుక్రవారం కామారెడ్డి జిల్లా లింగంపేట్ ఎంపీడీఓ కార్యాలయంలో రెవిన్యూ టీమ్ లతో సమావేశం నిర్వహించారు. గత నెల 17 నుండి 30 వరకు లింగంపేట్ మండలంలో భూ భారతి చట్టం ప్రకారం 23 రెవిన్యూ గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్టు క్రింద రెవిన్యూ సదస్సులు నిర్వహించినట్లు తెలిపారు. భూములకు సంబంధించిన అర్జీలను స్వీ కరించారని, అట్టి చట్టం ప్రకారం 4225 దరఖాస్తులు రావడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.

ఆయా అర్జీలను పరిశీలించి పరిష్కరించడానికి 9 టీమ్ లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు, దరఖాస్తుల ప్రకారం భూములను పరిశీలించడం జరుగుచున్నదని తెలిపారు. ఇప్పటి వరకు 1443 దరఖాస్తులకు సంబంధించిన క్షేత్ర పర్యటన చేసి భూములను పరిశీలించడం జరిగిందని తెలిపారు. మిగతా దరఖాస్తు లకు సంబంధించిన వాటిని త్వరగా పరిశీలించాలని అన్నారు. అటవీ క్షేత్రాల్లోనూ భూముల ను జాయింట్ సర్వే చేయాలనీ సూచించారు. దీర్ఘకాలిక పెండింగు దరఖాస్తులను కూడా పరిశీలించాలని తెలిపారు. ఈ సమావేశంలో  అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఆర్డీఓ ప్రభాకర్, భూ భారతి ప్రత్యేక అధికారి రాజేందర్, ల్యాండ్ సర్వే సహాయ సంచాలకులు శ్రీనివాస్, అటవీ అభివృద్ధి అధికారి రామకృష్ణ, తహసీల్దార్లు, రెవిన్యూ, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.