గోవింద్పేట్ పీహెచ్సీని తనిఖీ చేసిన కలెక్టర్
నిజామాబాద్, మార్చి 12 (విజయ క్రాంతి) : ఆర్మూర్ మండలం గోవింద్ పేట్ లో గల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ఆయా విభాగాలను సందర్శించి, రోగులకు అందిస్తున్న వైద్య సేవల తీరును గమనించారు. అందుబాటులో ఉన్న మందుల స్టాక్, వైద్యులు, సిబ్బంది హాజరును తనిఖీ చేశారు. వివిధ వార్డులను సందర్శించి రోగులకు కల్పిస్తున్న సదుపాయాలను గమనించారు.
బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తూ, మధుమేహం, మలేరియా వంటి వ్యాధుల నిర్ధారణ, వాటి బారిన పడిన వారికి అందిస్తున్న చికిత్సల గురించి అడిగి తెలుసుకున్నారు. అన్ని రకాల ఔషధాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. కాగా, పీ.హెచ్.సీలో గురువారం రోజున ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహిస్తున్న విషయం తెలుసుకున్న కలెక్టర్, ఆయా విభాగాలకు చెందిన ప్రత్యేక వైద్య నిపుణులు శిబిరానికి హాజరయ్యారా అని ఆరా తీశారు. ప్రజారోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని హితవు పలికారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్యరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ రాజశ్రీ తదితరులు ఉన్నారు.




