19-05-2025 05:12:04 PM
రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి..
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలోని మహబూబాబాద్, చిన్న గూడూరు మండలాల్లోని విస్సంపల్లి, ఉగ్గంపల్లి, కంబాలపల్లి, శనిగపురం, కంబాలపల్లి, చిన్న గూడూరు గ్రామాల్లో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్(District Collector Adwait Kumar Singh) సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నిర్వహిస్తున్న రిజిష్టర్ లను పరిశీలించారు. ఇంతవరకు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు, రైస్ మిల్లులకు తరలించిన వివరాలు, మద్దతు ధర చెల్లించిన వివరాలు మొదలగు అంశాలను అడిగి తెలుసుకున్నారు.
కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని వెంటవెంటనే మిల్లులకు తరలించాలని, కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోలుకు సరిపడా గోనె సంచులు, ఎగుమతికి లారీల ఏర్పాటుపై రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అధికారులు ధాన్యాన్ని మిల్లులకు సకాలంలో తరలించి రైతులకు ఎటువంటి సమస్యలు లేకుండా క్షేత్రస్థాయిలో పకడ్బందీగా చర్యలు తీసుకుంటారని తెలిపారు. వాతావరణ మార్పుల దృష్ట్యా అకాల వర్షాలు సంభవించే అవకాశం ఉన్నందున కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తడవకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సిద్దంగా ఉండాలని సూచించారు.
ధాన్యం కొనుగోళ్లు, రవాణా చేయు సందర్భంలో కేంద్రాల నిర్వహకులు సంబంధిత అధికారులు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు అప్రమత్తతతో ఉండాలన్నారు. గత ఏడాదితో పోలిస్తే జిల్లాలో ఈ సంవత్సరం అధిక దిగుబడి ఉన్నందున అందుకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలు తదితర అంశాలపై జిల్లా యంత్రాంగం తగిన చర్యలు తీసుకుందని తెలిపారు.గత పది రోజులుగా ప్రత్యేక అధికారులు, తహసిల్దార్లు క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేస్తూ కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడం కోసం ఆయా వర్గాలను సమన్వయ పరుస్తూ నిరంతరం పనిచేస్తూ నిరంతరం పనిచేస్తున్నానని చెప్పారు.