24-06-2025 05:04:52 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా ప్రధాన ఆసుపత్రిని మంగళవారం జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్(District Collector Adwait Kumar Singh) ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరికి వేగంగా వైద్యం అందించాలని సూచించారు. హాస్పిటల్ లోని మెడికల్, ఫీవర్, క్యాజువాలిటీ, ఐసీయూ, మెడికల్ కేర్, పిరియాడిటిక్, జనరల్ సర్జికల్ వార్డు, మెడికల్ స్టోర్, డయాలసిస్ తదితర వార్డులను సందర్శించి చికిత్స పొందుతున్న పేషెంట్ ధ్రవిడ్, ఆలన సెంటర్ లో క్యాన్సర్ పేషెంట్లు, ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్, హోమ్ కేర్ లతో మాట్లాడారు.
వారికి ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్లో కావలసిన అన్ని మందులు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. పరిసరాలలో పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతిరోజు ఉదయం సాయంత్రం సానిటేషన్ నిర్వహించాలని సూచించారు. నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ హస్పటల్, మెడికల్ కాలేజ్ స్థితిగతులను తెలుసుకున్నారు. పనులను వేగంగా పూర్తి చేయాలని అందుకు ప్రతినిత్యం కాంట్రాక్టర్లు సిబ్బందితో సమన్వయంతో పనిచేయాలన్నారు. పేషెంట్లకు నిత్యం వైద్య సేవలు అందిస్తూ షిఫ్టులవారీగా వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. వైద్య సేవలలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని సూచించారు. కలెక్టర్ వెంట హాస్పిటల్ సూపర్డెంట్ డాక్టర్ శ్రీనివాస్, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జగదీష్ తదితరులు ఉన్నారు.