calender_icon.png 26 August, 2025 | 4:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తూతూమంత్రంగా ఫీజుల నిర్ధారణ

26-08-2025 12:20:20 AM

  1. నామ్‌కే వాస్తేగా ఇంజినీరింగ్ ఫీజులపై పునర్విచారణ
  2. అఫిడవిట్లు తీసుకొని సరిపెడుతున్న టీఏఎఫ్‌ఆర్‌సీ
  3. ప్రభుత్వం జారీ చేసిన సవరణ నిబంధనలు వచ్చే బ్లాక్ పీరియడ్‌కు అమలంటూ మెలిక!
  4. గందరగోళంలో కాలేజీల యాజమాన్యాలు

హైదరాబాద్, ఆగస్టు 25 (విజయక్రాంతి): రాష్ర్టంలో ఇంజినీరిం గ్ సహా ఇతర ప్రొఫెషనల్ కాలేజీల్లో ఫీజుల నిర్ధారణకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన మార్గదర్శకాలు ఉత్తుత్తి కొలమానాలను తలపిస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం జారీ చేసిన సవరణ నిబంధనలను పక్కనబెట్టి తూతూమంత్రం గా ఫీజులను నిర్ధారిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఫీజుల నిర్ధారణ కోసం సోమవారం నుంచి ప్రారంభమైన కాలేజీల పునర్విచారణ నామ్‌కేవాస్తేగా సాగుతుంది. ప్రభుత్వం సవరించిన నిబంధనల ప్రకారం కాలేజీల్లో ఏమున్నాయి? ఏం లేవో? తేల్చి ఫీజులను ఖరారు చేయకుండా కాలేజీలు ఇచ్చిన నివేదికలనే బేస్ చేసుకొని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. 

అఫిడవిట్లు స్వీకరణ..

ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులపై తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) పునర్విచారణ సోమవారం నుంచి ప్రారంభమైంది. మొత్తం 160 ఇంజినీరింగ్ కాలేజీల ను సెప్టెంబర్ 3 వరకు పునర్విచారణ చేయనున్నారు. అయితే తొలిరోజై 20 కాలేజీలను పిలువగా, అందులో 17 కాలేజీలను టీఏఎఫ్‌ఆర్‌సీ అధికారులు విచారించి నట్టు తెలిసింది. మరో మూడు కాలేజీలు గైర్హాజరయ్యాయి. విచారణకు పిలిచిన కాలేజీల ఫీజులపై ఎలాంటి విచారణ జరగలేదని పలు కాలేజీల యా జమాన్యాలు తెలిపాయి. అయితే ఆయా కా లేజీల నుంచి టీఏఎఫ్‌ఆర్‌సీ అధికారులు గతంలో సమర్పించిన ఆడిటింగ్ నివేదికలు అసలైనవేనని అఫిడవిట్లు తీసుకొని పంపించేశారు.

ఆ మార్గదర్శకాలు పక్కకేనా?

ప్రొఫెషనల్ కాలేజీల్లో ఫీజుల నిర్ధారణకు ప్రభుత్వం జారీచేసిన నిబంధనలు పక్కకేనన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ మార్గదర్శకాలు ఇప్పుడు వర్తించవని, వచ్చే బ్లాక్ (మూడేళ్లు) పీరియడ్‌కు వర్తిస్తాయని ఓ కీలక అధికారి పేర్కొన్నారు. మళ్లీ కోర్టు తీర్పు ఆధారంగా నడుచుకుంటామని, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ముందుకెళ్తామంటూ వ్యాఖ్యానించారు. దీంతో కాలేజీల యాజమాన్యాల్లో గందరగోళం తలెత్తనున్నది.

అయితే ఇంత కసరత్తు చేసి ఏం ప్రయోజనమన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఫీజుల పెంపుపై సర్కారు ఇటీవలే కీలక ఆదేశాలిస్తూ జీవో నంబర్ -33ను జారీచేసింది. కళాశాలలు సమర్పించే అకౌంట్లతో పాటు, మౌలిక వసతులు, ఫ్యాకల్టీ, కాలేజీ ర్యాంకింగ్, విద్యాప్రమాణాలను పరిగణనలోకి తీసుకొని ఫీజులను నిర్ధారించాలన్నది. కానీ అవేమీ పట్టించుకోకుండా కేవలం కాలేజీల నుంచి అఫిడవిట్లను మాత్రమే తీసుకుంటున్నారు.

తీసుకోవాల్సిన ప్రమాణాలు ఇవి..

* విద్యార్థుల హాజరు, అకడమిక్ పనితీరు, ఫేషియల్ రికగ్నిషన్ అమలు, ఆధార్ ఆధారిత ఫీజుల చెల్లింపులు, రీసెర్చ్, పరిశోధనలు, ఆవిష్కరణలు, స్టార్టప్‌లు, రీసెర్చ్ ఆర్టికళ్ల ప్రచురణ, అవార్డులు, ప్లేస్మెంట్స్, జాతీయ, అంతర్జాతీయ ర్యాంకింగ్ పరిశీలించిన తర్వాతే ఫీజులను నిర్ధారించాలన్నది. 

* అకౌంట్స్, ఆడిటింగ్ నివేదికలు సరైనవేనని అఫిడవిట్ సమర్పించాలంది. తప్పులు లెక్కలు, సమర్పించిన కాలేజీలపై చట్టపరంగా చర్యలు తప్పవని జీవోలో హెచ్చరించింది. అయితే సోమవారం కాలేజీల నుంచి కేవలం అఫిడవిట్లు మాత్రమే తీసుకున్నట్టు తెలిసింది.

నేడు మరో 20 కాలేజీల హియరింగ్..

ఇదిలా ఉండగా.. మంగళవారం మ రో 20 కాలేజీలను టీఏఎఫ్‌ఆర్‌సీ విచారించనుంది. ఈ ప్రక్రియపై కాలేజీల యాజమా న్యాలు స్పందిస్తూ అంతా గందరగోళంగా, అయోమయంగా ఉం దని అసహనం వ్యక్తం చేస్తున్నాయి. అసలేం జరుగుతున్నదో తమకు తెలియ డం లేదని విస్మయం వ్యక్తం చేశాయి.