03-08-2025 12:05:06 AM
ముస్లింల కోసమే కాంగ్రెస్ తాపత్రయం
ఎమ్మెల్యే పాయల్ శంకర్
అదిలాబాద్,(విజయక్రాంతి): బీసీ లందరూ తిరగబడుతున్నారని గమనించిన కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల పేరుతో కొత్త నాటకానికి తెరలేపారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ధ్వజమెత్తారు. శనివారంహైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్ ని కట్టబెట్టడానికి బీసీ రిజర్వేషనాల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. ఆనాడు వైయస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో 4 శాతం రిజర్వేషన్లు ఇవ్వడంతోనే హైదరాబాదులో ముస్లిం కార్పొరేటర్ ల సంఖ్య పెరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి నిజంగా బీసీలపై చిత్తశుద్ధి ఉంటే ముస్లింలు లేనటువంటి 42 శాతం బీసీ రిజర్వేషన్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. అన్నాడు ఎంబీసీ పేరుతో బీసీలను మోసగించిన బీఆర్ఎస్ ప్రభుత్వం, ఈనాడు కాంగ్రెస్ రిజర్వేషన్ల పేరుతో బీసీలను మరో మారు మోసగిస్తుందన్నారు. బీసీలపై ప్రేమ ఉంటే మంత్రివర్గంలో బీసీ మంత్రి వర్గం శాతాన్ని ఎందుకు భర్తీ చేయలేక పోతున్నారని ప్రశ్నించారు. కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేసేంతవరకు బిజెపి కాంగ్రెస్ ని వెంటాడుతూనే ఉంటుందన్నారు.