29-05-2025 10:59:48 PM
మంత్రి సీతక్క..
మహబూబాబాద్ (విజయక్రాంతి): నాడు.. నేడు.. ఏనాడైనా నిలువ నీడలేని పేదవాడికి గూడు కట్టించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనిని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) అన్నారు. మహబూబాబాద్ జిల్లా గంగారంలో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకానికి ఎంపికైన లబ్ధిదారులకు ఇండ్ల హక్కు పత్రాలను అందించారు. అలాగే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... పేదవాడి సొంతింటి కల ఊహగానే మిగలకుండా, అర్హులైన ప్రతి నిలువ నీడలేని పేద కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని లక్ష్యంతోనే ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రవేశపెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో ప్రతి నియోజకవర్గానికి మొదటి విడత 3,500 ఇండ్లను కేటాయించడం జరిగిందన్నారు.
మారుమూల గిరిజన ప్రాంతాల్లో అదనంగా మరికొన్ని ఇందులో మంజూరు చేసి పేదలకు పక్కా గృహాలను నిర్మించి ఇస్తామని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన విధివిధానాలను అనుసరించి లబ్ధిదారులు గృహాలను నిర్మించుకోవాలని, అధికారుల సూచనలను సలహాలను తప్పకుండా పాటించి తక్కువ ఖర్చుతోనే ఇల్లు నిర్మించుకునే విధంగా కృషి చేయాలన్నారు. ఐటిడిఏ పరిధిలో గిరిజన కుటుంబాలకు అదనంగా ఇండ్లు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు.