25-09-2025 06:00:47 PM
హుజురాబాద్,(విజయక్రాంతి): నియోజకవర్గ అభివృద్ధి ప్రణవ్ తోనే సాధ్యమని కాంగ్రెస్ నాయకులు అన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలకు రూ.30 కోట్ల నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేయగా కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ గురువారం హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాలలోని ప్రధాన కూడల్లలో బాణాసంచా కాల్చి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు,ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నియోజకవర్గ ఇంచార్జ్ ప్రణవ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో నగరాలకు ధీటుగా మున్సిపాలిటీలను తీర్చిదిద్దుతున్నామని ఇది కాంగ్రెస్ పార్టీ విధానమని, ఉప ఎన్నిక తర్వాత హుజూరాబాద్ కు ప్రణవ్ నాయకత్వంలో నిధులు మంజూరు కావడం హర్షణీయమని అన్నారు. 3ఏళ్లు ఎమ్మెల్సీగా,ప్రభుత్వ విప్ గా ఉన్న సమయంలో కౌశిక్ రెడ్డి నియోజకవర్గానికి నిధులు తీసుకురాలేదని, ఇప్పుడు తీసుకొచ్చినట్టు చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. ఎన్నికల సమయంలో నియోజకవర్గానికి తీసుకొస్తానని హామీ ఇచ్చిన రూ. 1000 కోట్లు తీసుకురావాలని కోరారు.