11-12-2025 12:00:00 AM
శామీర్ పేట్ , డిసెంబర్ 10: అలియాబాద్ మున్సిపాలిటీ తుర్కపల్లిలోని స్వాగత్ రెస్టారెంట్ వెనకాల పలువురు అక్రమార్కులు ఎలాంటి అనుమతులు లేకుండా షెడ్లను నిర్మిస్తున్నారు.ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడుతూ ఎలాంటి అనుమతులు లేకుండా దర్జాగా షెడ్ ను నిర్మిస్తున్న సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి .
అక్రమార్కులకు రాజకీయ బలం ఉండటంతో సంబంధిత అధికారులు అటువైపు వెళ్లడానికే భయపడుతున్నారని పలు గుసగుసలు వినిపిస్తున్నాయి . ఇలా ఒకరిని చూసి మరొకరు అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని తెలుస్తుంది. కరీంనగర్ రహదారికి సమీపంలోని షెడ్ నిర్మాణం కొనసాగుతున్న సంబంధిత అధికారులకు మాత్రం ఏమి తెలియడం లేదా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయమై సంబంధిత మున్సిపల్ కమిషనర్ ను వివరణ కోరగా.. తమ దృష్టికి రాలేదని ఎంతటి వారైనా సరే అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే ఉపేక్షించేది లేదని వెంటనే అక్రమ నిర్మాణం పై చర్యలు తీసుకుంటామని తెలిపారు.