08-10-2025 06:21:21 PM
అర్మూర్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన మొక్కజొన్న, ధాన్యం పంటల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.ప్రభాకర్, కార్యదర్శి బి.దేవరాంలు డిమాండ్ చేశారు. బుధవారం అర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్ లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి వరంగల్ డిక్లరేషన్ పేరుతో రైతాంగానికి అన్ని పంటలకు 500 రూపాయల బోనస్ ఇస్తానని, రెండు లక్షల రుణమాఫీ చేస్తానని, అన్ని పంటలను ప్రభుత్వం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చి ఎన్నికల గెలిచారని గుర్తు చేశారు. కానీ ఏ ఒక్క వాగ్దానం 100% పూర్తి చేయలేదని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో 16 లక్షల ఎకరాలలో మొక్కజొన్న సాగు అవుతుందని మొక్కజొన్న కోతకొచ్చి సుమారు 25 రోజులు గడుస్తున్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి ఏంటో అర్థం అవుతుందని విమర్శించారు. మొక్కజొన్న రోడ్లపై ఆరబెట్టుకుంటుంటే తడుస్తున్నవని, ఎండుతున్నవి కొంతమంది రైతులవి మొలక ఎత్తుతున్నయని వాపోయారు. దీంతో వ్యాపార దళారీ వర్గం 2400 మద్దతు ధర ఉంటే కేవలం 1600 నుంచి 1700లకే కొనుగోలు చేస్తూ అదికూడా 15 రోజులకు డబ్బులు చెల్లిస్తామని వాయిదాలు పెడుతున్నారని అన్నారు. పెట్టిన పెట్టుబడి రాక రైతులు దివాలా తీసే స్థితికి వచ్చిందని అన్నారు.
మరోవైపు అన్ని పంటలను కొనుగోలు చేస్తానని, పంటలకు క్వింటాల్కు 500 బోనసిస్తానని హామీ ఇచ్చి ఒక సన్న ధాన్యాన్ని కొనుగోలు చేసి 50% దాన్యానికే బోనస్ చెల్లించారు. కులాల్లో ఏ బి సి డి లు పెట్టినట్లుగానే ధాన్యంలో కూడా ఏ బీ సీడి లు పెట్టే పద్ధతి రేవంత్ రెడ్డికే చెల్లుతుందని ఎద్దేవ చేశారు. బేషరతుగా మొక్కజొన్నలు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి క్వింటాలకు 500 బోనస్ ఇవ్వాలని, ధాన్యాన్ని ఏ బి సి డి లు లేకుండా కొనుగోలు చేసి 500 బోనస్ బకాయి పడ్డ బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. రెండు లక్షల రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేదని అన్నారు. వెంటనే మొక్కు జొన్నల, అన్ని రకాల ధాన్యాల కొనుగోలు కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు సురేష్, కార్యదర్శి బి.కిషన్, డివిజన్ నాయకులు యు.రాజన్న, ఆకుల గంగారం, జక్కం శేఖర్, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కిషన్ తదితరులు పాల్గొన్నారు.