calender_icon.png 30 May, 2025 | 10:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్పొరేట్ ‘నీట్’ గాలం

29-05-2025 02:05:21 AM

- ‘చితి’కి పోతున్న విద్యార్థులు 

- పోటీ పరీక్షలతో పెరిగిన మానసిక ఒత్తిడి 

- ఆత్మ స్థుర్యైన్ని కోల్పోతున్న విద్యార్థులు 

జగిత్యాల, మే 28 (విజయక్రాంతి): అలా ‘నీట్’ పరీక్ష ముగిసిందో లేదో, ఇంకా ఫలితాలు కూడ రాకముందే కార్పొరేట్ విద్యా సంస్థలు మళ్లీ ‘నీట్’ గాలం విసరడం ప్రారంభించాయి. వచ్చే ఏడాది జరగబోయే ‘నీట్’ కోసం తమ సంస్థలో రకరకాల ఆఫర్లున్నాయని విద్యార్థుల, తల్లిదండ్రుల ఆశలతో కార్పొరేట్ ‘బెట్టింగ్’ చెలగాటం మొదలైంది.

ఇంటర్మీడియట్లో రెండు సంవత్సరాల పాటూ చదవాల్సిన సిలబస్ మొత్తం అతి తక్కువ కాలంలో.. అతి ఎక్కువగా.. మీ పిల్లల మెదడులో నింపేస్తామని రకరకాల టారీఫ్లతో కార్పొరేట్ విద్యా వ్యాపార విషనాగులు బుసలు కొడుతున్నాయి. ఇటీవల నీట్ పరీక్షకు హాజరైన పిల్లల తల్లిదండ్రుల ఫోన్లు టింగు టింగుమని మోగుతున్నాయి.

మీ పాప/బాబు ‘నీట్’ ఎలా రాశారు?.. ర్యాంక్ వస్తుందా?.. లాంగ్ టర్మ్ పంపిస్తారా?.. అని ప్రశ్నల వర్షం కురిపిస్తూ రకరకాల ఆఫర్లతో ‘నీట్’గా కార్పొరేట్ గాలం వేస్తున్నారు.

అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ బిడ్డ డాక్టర్ కావాలని తల్లిదండ్రులు కలలు కనడం మంచిదే.. కానీ ఆ కల నిజం కావాలనే తపనలో పిల్లలపై తలకు మించిన భారం మోపడమే విచారకరం...  

సాంకేతికత విపరీతంగా పెరిగిన ప్రస్తుత పోటీ ప్రపంచంలో పిచ్చి పీక్స్’కు పోయి అన్న చందాగా.. ఎలాగైనా ర్యాంకు సాధించాలనే కోరిక మానసిక ఒత్తిడిగా మారి విపత్కరస్థితికి దారి తీయడం వినాశకరం... 

ఎలాగైనా మంచి ర్యాంకు సాధించాలి అనే తపన, పట్టుదల మంచిదే.. కానీ ర్యాంకు రాదేమోనన్న ఆలోచనలో ఆత్మస్థుర్యైన్ని కోల్పోయి బ్రతుకు బుగ్గిపాలు చేసుకోవడమే విషాదకరం...  ఈ నెల 4వ తేది ఆదివారం సాయంత్రం ‘నీట్’ పరీక్ష ముగియగానే, రాత్రి వరకు నెట్లో ‘కీ’ డౌన్లోడ్ అయింది. ఆదరా బాదరాగా ఆ ‘కీ’ చూసుకొని నాకు ర్యాంకు రాదేమో నన్న భయంతో అదే రోజు రాత్రి జగిత్యాల జిల్లాలో ఒక విద్యార్థిని.. తెల్లారి సోమవారం రాత్రి ఆదిలాబాద్ జిల్లాలో మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడడం బాధాకరం... 

జగిత్యాలలో ‘పూజ’, ఆదిలాబాద్‌లో ‘మనోజ్’ 

జగిత్యాల జిల్లా చలిగల్ గ్రామానికి చెందిన ‘జంగ పూజ’ అనే విద్యార్థిని నీట్ పరీక్షలో తనకు ర్యాంకు రాదేమోనని ఈ నెల 4న ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. పూజ తండ్రి రాజేశం ఆటో డ్రైవర్, తల్లి గృహిణి, వారిది నిరుపేద కుటుంబం. అలాగే అదిలాబాద్ జిల్లా ఉట్నూరు గ్రామానికి చెందిన ‘రాయి మనోజ్’ అనే విద్యార్థి కూడా ‘నీట్’ కారణంగా ఈ నెల 5న సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు.

తండ్రి గంగాధర్ ఉపాధ్యాయుడు, తల్లి స్వాతి గృహిణి. ఈ ఇరునురు కూడ కార్పోరేట్ కాలేజిల్లో 2 పర్యాయాలు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్న వారే అనేది గమనారం. అలాగే ఇరువురి తల్లిదండ్రులూ మధ్య తరగతికి చెందిన వారే. కళ్ల ముందే ఎదిగిన పిల్లలు బలి కావడం ఆ కుటుంబాలను ఎంతగానో కలచివేసింది. చేతికి అందివచ్చిన పిల్లలను కోల్పోయిన ఆ తల్లిదండ్రుల మనోవేదన తీరేదెలా?..  

తప్పు ఎవరిది?... 

తమ ఈడు సాటి పిల్లలను చూసి తాము కూడా డాక్టర్ కావాలని ఆశపడుతున్న విద్యార్థులది తప్పా?.. లేక పోటీ ప్రపంచంలో తమ ముందున్న సమాజంలో తమ పిల్లలూ డాక్టర్ చదువుతున్నారని చెప్పుకోవడం కోసం ఎలాగైనా ర్యాంకు రావాలని ఆశపడ్డ తల్లిదండ్రులది తప్పా?.. ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న పిల్లలు ఒకటి, రెండు, మూడు, నాలుగు... ఇలా ‘పట్టువదలని విక్రమార్కులు’ అన్న చందంగా ఎన్నిసార్లునా ‘నీట్’ పరీక్ష రాయొచ్చనే అవకాశం కల్పించిన ప్రభుత్వానిది తప్పా?... 

లక్ష్యం ఒకటేనా?... 

పలువురు విద్యావేత్తలు, మానసిక నిపుణుల విశ్లేషణ ప్రకారం విద్యార్థులు, తల్లి దండ్రులు వారి ఆలోచన విధానాన్ని (మైం డ్‌సెట్) మార్చుకోవాలి. ఎంచుకున్న లక్ష్యా న్ని సాధించడం కోసం పట్టుదలతో కృషి చేయడం మంచిదే, కానీ అది సాధ్యం కాదని తెలియంగానే దానికి ప్రత్యామ్నాయం ఆలోచించి మన మనసును కుదుట పరచుకో వడం చాలా ముఖ్యం.

ఒకవేళ ‘నీట్’లో అనుకున్న ర్యాంకు రాకుంటే లక్షల్లో చెల్లించాల్సిన ఫీజుల భారం మోయగలమో, లేదో ముందే ఆలోచించుకోవడం మంచిది. ‘ఎలాగైనా ర్యాంకు సాధించాలి’ అని పిల్లలను ఒత్తిడికి గురి చేస్తూ పదే పదే పరీక్షలకు సిద్ధం చేయడం మంచిది కాదు. 

మనసుంటే మార్గాలెన్నో...

ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకున్న విద్యార్థులు ‘నీట్’ కాకుంటే ఎంసెట్, క్యూట్, ఐఏటి... వంటి మరెన్నో పరీక్షలు రాసి, పలు కోర్సుల్లోనూ చేరవచ్చు. అలా కాకుంటే ఏంచక్కా డిగ్రీ, పీజీ పూర్తి చేసి టీచర్లు, లెక్చరర్లు కావచ్చు. లేదంటే పలు పబ్లిక్ సర్వీస్ పరీక్షలు రాసి ప్రభుత్వ ఉద్యోగాలు పొందవచ్చు.

కావాలంటే అగ్నివీరులుగా ఇండి యన్ ఆర్మీలోనూ చేరవచ్చు. ఇవి కాక బ్యాం కింగ్, ఇండస్ట్రియల్, ప్రైవేట్, కార్పొరేట్ సెక్టార్... ఇలా ఎన్నో, మరెన్నో అవకాశాలు. ఓపిగ్గా, భవిష్యత్తు గూర్చి బాధ్యతగా నీట్’గా ఆలోచిస్తే ‘నీట్’కి బదులు బోలెడు అవకాశాలు మన ముందున్నాయని విద్యార్థులు, తల్లిదండ్రులు గమనిస్తే బాగుంటుంది.