30 April, 2026 | 12:16 AM

Breaking News

నీరు, పారిశుధ్యంపై అవగాహన సదస్సు   •   సనత్‌నగర్‌లో ఘనంగా సమ్మర్ క్రికెట్ క్యాంప్ ప్రారంభం   •   కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ   •   పది ఫలితాలలో సత్తా చాటిన మండల విద్యార్థులు   •   సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల విద్యార్థుల ప్రతిభ..   •   పని ప్రదేశాల్లో మహిళలను వేధిస్తే సహించం   •   భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వీరబ్రహ్మేంద్రస్వామి వార్షికోత్సవ వేడుకలు.   •   పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తే... క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం   •   టెన్త్ ఫలితాల్లో ఎంజెపీటీసీడబ్ల్యూఆర్ విద్యార్థినుల ప్రతిభ   •   పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినట్లు కాదు   •  

కుల్గాంలో ఎదురుకాల్పులు

10-08-2025 12:03 AM

- ఇద్దరు సైనికులు మృతి

- కొనసాగుతున్న ‘ఆపరేషన్ అఖాల్’

కుల్గాం, ఆగస్టు 9: జమ్మూ కశ్మీర్‌లోని కుల్గాంలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు సైనికులు మృతి చెందారు. ‘ఆపరేషన్ అఖాల్’ తొమ్మిదో రోజు కూడా కొనసాగింది. కుల్గాంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులు రహస్య స్థావరాలను ఏర్పరుచుకొని ఉంటున్నట్టు నిఘా వర్గాలకు సమాచారం అందింది.

దీంతో శనివారం తెల్లవారుజామున కుల్గాం లో ఆర్మీ, జమ్మూ కశ్మీర్ పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించి ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి కాల్పులు జరిపాయి. ఈ క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు సైనికులు లాన్స్ నాయక్ ప్రీత్‌పాల్ సింగ్, సిపాయి హర్మిందర్‌సింగ్‌లు వీరమరణం పొందగా.. మరో ఇద్దరు సైనికులు గాయపడ్డారు.

మృతుల కుటుంబాలకు చినార్ కార్ప్స్ సానుభూతి వ్యక్తం చేసింది. కాగా ఆపరేషన్ అఖాల్ ఇంకా కొనసాగుతున్నట్టు అధికారులు వెల్లడించారు. మరోవైపు ఆగస్టు 1న అఖాల్ గ్రామ పరిసరాల్లో ‘ఆపరేషన్ అఖాల్’ పేరుతో భద్రతాధికారులు ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో ఇప్పటికే పలువురు ఉగ్రవాదులను దళాలు మట్టుబెట్టాయి. ఆపరేషన్ నేపథ్యంలో ఈ ప్రాంతంలో తుపాకీ శబ్దాలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.

దీంతో గ్రామంలోని మహిళలు, చిన్నారులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కాల్పు ల శబ్దంతో రాత్రుళ్లు నిద్ర కూడా పోలేకపోతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేయడంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏడాదిలో ఇంత సుదీర్ఘ సమయం కొనసాగుతున్న ఆపరేషన్ ఇదేనని అధికారులు పేర్కొన్నారు.