13-12-2025 01:16:09 PM
హైదరాబాద్: బాగ్ లింగంపల్లి మైనార్టీ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై కింగ్ కోఠి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు పరామర్శించారు. వారి వెంట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ ఉన్నారు. విద్యార్థులకు అందుతున్న వైద్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హరీష్ రావు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై, రాహుల్ గాంధీ పర్యటనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రతిరోజూ ఏదో ఒక గురుకుల పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు కలుషిత ఆహారం తిని ఆసుపత్రి పాలవుతున్నారు. మొన్న షామీర్ పేట్ లో బీసీ గురుకుల పాఠశాలలో అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు ఏకంగా పోలీస్ స్టేషన్ కి వెళ్లే పరిస్థితి వచ్చిందని, రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విద్యార్థులే ఫిర్యాదు చేశారని ఆరోపించారు. నిన్న మాదాపూర్ లోని చందు నాయక్ తండాలో మధ్యాహ్న భోజనం వికటించి 43 మంది పిల్లలు ఆసుపత్రిలో చేరారు. ఇప్పుడు ముషీరాబాద్ నియోజకవర్గంలో బాగ్ లింగంపల్లి మైనార్టీ గురుకులంలో కలుషిత ఆహారం తిని 90 మంది ఆసుపత్రి పాలయ్యారని మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి విజన్ 2047 అని డబ్బా కొట్టుకుంటున్నాడని, ఇది విజన్ 2047 కాదు.. విద్యార్థుల పాలిట పాయిజన్ 2047గా మారిందని విరుచుకుపడ్డారు. నీకు నిజాయితీ ఉంటే గురుకులాల్లోని పిల్లలకు కడుపునిండా అన్నం పెట్టు అని, ఆసుపత్రిలో చేరిన విద్యార్థులు తిరిగి మళ్లీ హాస్టల్ కి వెళ్ళాంటే భయపడతున్నారని హరీశ్ రావు ఆగ్రహం వక్తం చేశారు. ప్రభుత్వ హాస్టళ్లలో పిల్లలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారని, కేసీఆర్ హయాంలో సన్నబియ్యంతో మంచి నాణ్యమైన ఆహారం విద్యార్థులకు అందేదన్నారు. ఇప్పుడు దొడ్డు బియ్యం పెడుతున్నారని, అన్నం ఉడకడం లేదు, సరైన భోజనం పెట్టట్లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
టీవీ యాడ్లు, పేపర్ యాడ్ల కోసం మాత్రమే తెలంగాణ రైసింగ్, వాస్తవంలో గురుకుల, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు హాస్పిటల్స్ లో ఫాలింగ్ అని వ్యాఖ్యానించారు. దేంట్లో రైసింగ్? అవినీతిలో రైసింగ్, అరాచకంలో రైసింగ్, అహంకారంలో లేక కబ్జాలో రైసింగ్ అని హరీశ్ రావు ప్రశ్నించారు. రూ.20 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడుతున్నా అంటున్నావు, అప్పటివరకు పిల్లలు బతికుండేది ఎట్లా అని అడిగారు. ముఖ్యమంత్రికి కనీసం చీమ కుట్టినట్టైనా లేదు. ఏనాడు కూడా ఆసుపత్రి పాలైన విద్యార్థులను పరామర్శించలేదని, ఫుట్బాల్ ఆడడంలో ముఖ్యమంత్రి బిజీగా ఉంటాడని దుయ్యబట్టారు. మెస్సితో ఫుట్బాల్ ఆడటానికి మేస్త్రి కోట్లు ఖర్చు చేస్తున్నాడని, 5 కోట్లతో స్టేడియం కట్టించుకున్నాడు. 100 కోట్లు ఖర్చుపెట్టి ఫుట్బాల్ ఆడడం ఎందుకు రేవంత్ రెడ్డి?, ఆ డబ్బుతో విద్యార్థులకు ఒక పూట కడుపునిండా అన్నం పెట్టలేవా? అని నిలదీశారు. నీ కబ్జాలకు, నీ సోకులకు, నీ కమిషన్లకు టైం సరిపోవడం లేదు.. ఇంక నువ్వు విద్యార్థులను ఎలా పట్టించుకుంటావని హరీశ్ పేర్కొన్నారు.