22 April, 2026 | 6:37 AM

మోదీ పాలనలో దేశం సురక్షితం

09-05-2024 03:07 AM

బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు

గజ్వేల్, మే8(విజయక్రాంతి): కాంగ్రెస్‌కు పాలనలో ఎప్పుడు ఎక్కడ బాంబులు పేలుతాయోనని జనం భయపడేవారని, మోదీ పాలనలో ఎక్కడా ఆ భయం లేదని బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు అన్నారు. బుధవారం గజ్వేల్ నియోజకవర్గంలోని వర్గల్, ములుగు, తున్కి బొల్లారం ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో ఆయన రోడ్‌షో నిర్వహించారు. మోడీ పాలనలో బాంబు పేలుళ్ల భయం లేకుండా ప్రజలు ధైర్యంగా జీవించారన్నారు.

భూములు గుంజుకుని కేసీఆర్ ఎకరా కోటి రూపాయలకు అమ్ముకున్నారని, రైతులకు రూ. 12 లక్షలే ఇచ్చారన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ వెంకట్రామిరెడ్డి 15 వందల ఎకరాల భూములు రైతుల దగ్గర నుండి గుంజుకున్నారని ఆరోపించారు. దుబ్బాకలో తాను ఓడిపోయానని ప్రచారం చేస్తున్న కేసీఆర్, రేవంత్‌రెడ్డిలు కామారెడ్డిలో ఓడిపోలేదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వస్తే మళ్లీ త్రిపుల్ తలాక్ తీసుకొస్తుందన్నారు.

కేసీఆర్ హయాంలో పేదలకు డబుల్ బెడ్‌రూం కలగానే మిగిలిందన్నారు. వెంకట్రామిరెడ్డి ఎన్ని సూట్ కేసులు మోస్తే కేసీఆర్ ఎంపీ సీటు ఇచ్చాడో అందరికీ తెలుసన్నారు. కవిత లాగే వెంకట్రామిరెడ్డి కూడా జైలుకు వెళ్లడం ఖాయమ న్నారు. వెంకట్రామిరెడ్డికి పొరపాటున ఓటు వేస్తే రాజ్ పుష్పలాగే భూములన్నీ గుంజుకుంటాడని ఆరోపించారు.