01-09-2025 01:48:28 PM
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశం.
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): మున్సిపల్ పట్టణ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలలో వీధి కుక్కలపై పెద్ద ఎత్తున ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి(District Collector Ila Tripathi) ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయమై సోమవారం ఆమె సంబంధిత అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, ఆర్ డి ఓలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పాఠశాల విద్యార్థులకు వీధి కుక్కలపై కరపత్రాల ద్వారా అవగాహన కల్పించాలని, దీనిద్వారా వారి తల్లిదండ్రులకు సమాచారం వెళుతుందని, అలాగే విద్యార్థులతో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించాలని చెప్పారు. దీంతోపాటు, గ్రామీణ ప్రాంతాలలో హోర్డింగ్ లు ఏర్పాటు చేసి ప్రజలకు వీధి కుక్కల వల్ల కలిగే నష్టాలు, వీధి కుక్కల స్టెరిలైజేషన్, వాక్సినేషన్, దత్తత తదితర అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. గతవారం దేవరకొండ డివిజన్లో వీధి కుక్కల వ్యాక్సినేషన్ ,దత్తత కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించడం పట్ల ఆమె దేవరకొండ డివిజన్ అధికారులు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిని అభినందించారు.
ఇదేవిధంగా అన్ని మున్సిపల్ పట్టణ ప్రాంతాలలో కుక్కల వ్యాక్సినేషన్ తో పాటు, స్టెరిలైజేషన్, కుక్కలను దత్తత తీసుకునే విషయంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, ఇందుకుగాను కుక్కల ప్రేమికులతో సమావేశాలు నిర్వహించాలని చెప్పారు.మిర్యాలగూడ మున్సిపాలిటీలో "ఎనిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రం " ఏర్పాటుకు తక్షణమే అంచనాలను రూపొందించి ప్రణాళిక తయారు చేసి పంపించాలని మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ ను ఆదేశించారు.పంచాయతీ శాఖ ద్వారా అన్ని గ్రామీణ ప్రాంతాలలో హోర్డింగులు ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల మున్సిపల్ అధికారులతో అనుసంధానం చేసుకొని కుక్కలకు వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్,దత్తతలకు చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు.
అన్నీ పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పించడంలో జిల్లా విద్యాశాఖ అధికారి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.మండల ప్రత్యేక అధికారులు సైతం వారి మండలాలలో చెత్త, చెదారం, డంపింగ్ యార్డులు గుర్తించి ఎప్పటికప్పుడు వాటిని శుభ్రం చేయించాలని, అలాగే కుక్కలను గుర్తించి వాటికి వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ ,దత్తత పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు.ఇటీవల జగిత్యాల జిల్లాలో మూడు సంవత్సరాల బాలుడు కుక్క కాటుకు గురై మరణించిన సంఘటన లాంటిది నల్గొండ జిల్లాలో జరగడానికి వీలులేదని, ఆ విధంగా అధికారులు అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద దరఖాస్తుల పరిశీలనలో వెనుకబడిన తహసిల్దారులు దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేసి ఆర్డీవోలకు పంపించాలని, నల్గొండ, చండూరు ,మిర్యాలగూడ ,దేవరకొండ ఆర్డీవోలు వారితో ఉన్న దరఖాస్తులన్నింటిని ఆన్లైన్ ద్వారా డిఆర్ఓ పంపించాలని చెప్పారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి, తదితరులు మాట్లాడారు.