01-09-2025 04:46:41 PM
హైదరాబాద్: కాళేశ్వరంలో చిన్న భాగం కుంగితే మొత్తం ప్రాజెక్టు పోయినట్లు చేస్తున్నారని.. ఎవరి వల్ల, ఎందుకోసం కేసీఆర్(KCR)కు అవినీతి మరక అంటింది అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) మీడియా సమావేశంలో అన్నారు. కేసీఆర్ పక్కనున్న కొందరు చేసిన పని వల్ల ఆయనకు చెడ్డపేరు వచ్చిందని.. ఐదేళ్లు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీష్ రావు పాత్ర లేదా..? అని మండిపడ్డారు. మాజీ ఎంపీ సంతోష్, హరీష్ రావు, మేఘా ఇంజినీరింగ్ వల్ల కేసీఆర్ కు చెడ్డపేరు వచ్చిందని, కేసీఆర్ జనం కోసం పనిచేస్తే.. వాళ్లు సొంత ఆస్తులు పెంపు కోసం పనిచేశారని కవిత పేర్కొన్నారు. హరీష్ రావు, సంతోష్ నాపై ఎన్నో సార్లు కుట్రలు చేశారని తెలిపారు. హరీష్ రావు పాత్ర ఉన్నందునే రెండోసారి మంత్రివర్గం నుంచి తప్పించారని, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లతో హరీష్ రావు, సంతోష్ కుమ్మక్కు అయ్యారని అన్నారు. నాపై ఎన్ని కుట్రలు చేసినా.. ఏం మాట్లాడినా నోరు మెదపలేదని తెలిపారు. ఈరోజు కేసీఆర్ బిడ్డగా నేను ఎంతో బాధపడుతున్నానని.. హరీష్ రావు, సంతోష్ వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని కవిత సంచలన ఆరోపణలు చేశారు.
రేవంత్ రెడ్డి, హరీష్ రావు, సంతోష్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని.. హరీష్ రావు, సంతోష్ ను రేవంత్ రెడ్డి ఏమి అనరని నా తండ్రిపైనే బాణం వేస్తారని కవిత చెప్పారు. కేసీఆర్ మీద సీబీఐ దర్యాప్తు వేశాక తొక్కలో పార్టీ ఉంటే ఏంటి.. లేకపోతే ఏంటి.. మా తండ్రి దాకా వచ్చాక ఇంకా పార్టీ ఏంటి.. అని పేర్కొన్నారు. ఇది నా తండ్రి పరువుకు సంబంధించిందని, నా లేఖ బయటకు వచ్చినా నేను ఎవరి పేర్లు బయటపెట్టలేదని తెలిపారు. ఈ వయసులో కేసీఆర్ సీబీఐ విచారణ ఎందుకు ఎదుర్కోవాలని, నా మాటల వల్ల బీఆర్ఎస్ శ్రేణులకు కోపం రావచ్చు, అప్పుడప్పుడూ వాస్తవాలు మాట్లాడుకుని మందు తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిదని కవిత ఆరోపించారు. కేసీఆర్ రాజకీయాల్లో ఇన్నేళ్లు ఉన్నా.. ఆస్తులు సంపాదించుకోలేదన్నారు. డబ్బులపై కేసీఆర్ కు ఏనాడు ఆశలేదని, కాళేశ్వరంలో పనిచేసిన ముగ్గురు ఇంజనీర్ల వద్ద వందల కోట్ల సంపద ఉందని పేర్కొన్నారు. కాళేశ్వరం ఇంజనీర్ల ఆస్తులపై ఎందుకు విచారణ జరిపించట్లేదని, ఏసీబీకీ చిక్కిన ఇంజనీర్ల వెనుక ఎవరున్నారో ఎందుకు విచారణ చేయట్లేదన్నారు. హరీష్ రావు, సంతోష్ వెనుక రేవంత్ రెడ్డి ఉండి కాపాడుతున్నారని, బీఆర్ఎస్ ఇబ్బందులకు గురి చేసిన అవినీతి అనకొండలను ఏమీ అనట్లేదని మండిపడ్డారు. వాళ్ల సోషల్ మీడియా బ్యాచ్ రేపటి నుంచి నాపై దుష్ప్రచారం చేస్తారని కవిత తెలిపారు.