29-06-2025 06:50:28 PM
మహబూబాబాద్/వరంగల్ (విజయక్రాంతి): కాకతీయుల రాజధాని ఏకశిలానగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలో పరమపావనమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి దేవస్థానంలో శాకంభరీ నవరాత్ర మహోత్సవములు నాల్గవ రోజుకు చేరుకున్నాయి. ఆదివారం ఉదయం అమ్మవారికి సుప్రభాత సేవతో ప్రారంభమైన నిత్యాహ్నికం, క్షీరాన్న నివేదన, నీరాజన మంత్ర పుష్పములతో ముగిసింది. ఆలయ ప్రధానార్ధకులు శ్రీ భద్రకాళి శేషు శాకంభరి ఉత్సవ నిర్వహణలోని నాల్గవ రోజు కార్యక్రమంలో భాగంగా అమ్మవారి దశ మహావిద్యలలోని కాళీ క్రమం, షోడశీ క్రమాన్ని అనుసరించి ఉదయం ‘కురుకుల్ల’ గా, సాయంకాలం ‘భేరుండా’ గాను అమ్మవారిని అలంకరించి నవరాత్ర విశేష పూజలు నిర్వహించారు.
కురుకుల్లా మాత కాటుకలాంటి నల్లని చీకటి వర్ణముతో నుండి సముద్రమునందు మణిమయమైన నౌకాయానము అతిశీఘ్రముగా జరుపుచూ ప్రారబ్ధవశమున సంసార సాగరమునందు కొట్టుమిట్టాడుతున్న జీవులను తన నౌకయందు ఎక్కించుకొని దరిచేర్చును. భేరుండా మాత భక్తుల పాపములను శమింపజేయునని ఆలయ ప్రధానార్ధకులు బ్రహ్మశ్రీ భద్రకాళి శేషు తెలిపారు.
భద్రకాళి ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ
శాకాంబరి ఉత్సవాలకు తోడు ఆదివారం కావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆలయ ధర్మకర్తలు బింగి సతీష్, గాండ్ల స్రవంతి, జారతి వెంకటేశ్వర్లు, ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ శివ సుబ్రహ్మణ్యం, ఈఓ శ్రీమతి శేషుభారతి భక్తులకు ఏలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. వరంగల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి గజానంద్ దంపతులు, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మిట్టపల్లి వెంకటేష్, రాష్ట్ర యువజన కాంగ్రెస్ సెక్రెటరీ తోట పవన్ తదితరులు భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.