01-11-2025 07:00:54 PM
వారంపాటు స్పెషల్ డ్రైవ్ 9 ట్రాన్స్జెండర్లు అరెస్ట్ షీటీమ్స్ డికాయ్ ఆపరేషన్లు
శేరిలింగంపల్లి,(విజయక్రాంతి): మహిళలు, బాలల భద్రత కోసం సైబరాబాద్ పోలీసులు ముమ్మర చర్యలు ప్రారంభించారు. అక్టోబర్ 26 నుంచి 31 వరకు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (ఏఎచ్ టీయూ) ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్లో శుక్రవారం రాత్రి దాడులు, సోదాలు చేపట్టారు. ఈ క్రమంలో వేశ్యావృత్తి నెట్వర్క్లలో భాగంగా ఉన్న 9 మంది ట్రాన్స్జెండర్లను అదుపులోకి తీసుకోగా, రెండు పిటా కేసుల్లో 3 మంది బాధితులను రక్షించి, 5 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఇక మహిళా భద్రతను కాపాడేందుకు సైబరాబాద్ షీటీమ్స్ అట్టహాసంగా కదిలాయి. ఒక్క వారం వ్యవధిలోనే 142 డికాయ్ ఆపరేషన్లు జరిపి, పబ్లిక్ ప్రదేశాల్లో అసభ్య ప్రవర్తనకు పాల్పడిన 76 మందిని రంగంలోనే పట్టుకున్నాయి. వారిలో కొందరిపై 51 చిన్న కేసులు నమోదు చేయగా, మిగతావారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. మహిళల వేధింపులపై 17 ఫిర్యాదులను స్వీకరించి విచారణ చేపట్టినట్లు షీటీమ్స్ అధికారులు తెలిపారు.భార్యాభర్తల మధ్య తలెత్తిన కుటుంబ కలహాల పరిష్కారానికి సైబరాబాద్ ఫ్యామిలీ కౌన్సెలింగ్, (సీడీఇడబ్లూ) సెంటర్లు ముందుకొచ్చాయి.ఈ క్రమంలో 29 కుటుంబాలను పునరేకీకరించడంలో విజయవంతమయ్యాయి.
నేరాల నివారణ, సామాజిక అవగాహన పెంపు దిశగా (ఏఎచ్ టీయూ) షీటీమ్స్ సంయుక్తంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాయి. వివిధ ప్రాంతాల్లో జరిగిన అవగాహన సమావేశాలకు 223 మంది సభ్యులు హాజరయ్యారు. వీరికి మానవ అక్రమ రవాణా, బాల కార్మికులు, బాల్య వివాహాలు, ఈవ్టీజింగ్, సోషల్ మీడియా వేధింపులు, సైబర్ బుల్లింగ్, స్టాకింగ్, భిక్షాటన, సైబర్ మోసాలు వంటి అంశాలపై వివరణ ఇచ్చారు. అలాగే మహిళల హెల్ప్లైన్ 181, బాలల హెల్ప్లైన్ 1098, సైబర్ మోసాల కోసం 1930, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 ప్రాముఖ్యతను వివరించారు. ఈ మొత్తం డ్రైవ్ అవగాహన కార్యక్రమాలు (మహిళలు అండ్ బాలల భద్రత విభాగం) డీసీపీ కె. శ్రుజన పర్యవేక్షణలో జరిగాయి.