క్రమంగా బలహీనపడుతున్న 'మొంథా' తుపాన్
అమరావతి: బంగాళాఖాతం మీదుగా తీవ్ర తుఫానుగా మారి ఆంధ్రప్రదేశ్ను దెబ్బతీసిన మొంథా తుఫాను(Cyclone Montha) మంగళవారం అర్ధరాత్రి సమయంలో తీరాన్ని తాకింది. భారత వాతావరణ శాఖ ( India Meteorological Department) ప్రకారం, తుఫాను కాకినాడకు దక్షిణంగా నరసాపురం సమీపంలో మచిలీపట్నం-కళింగపట్నం మధ్య తీరం దాటింది. రాత్రి 11:30 గంటల నుండి 12:30 గంటల మధ్య తీరం దాటే ప్రక్రియ పూర్తయిందని ఐఎండీ తెలిపింది. తీరం దాటిన తర్వాత కూడా, మోంత తీవ్ర తుఫానుగా తన తీవ్రతను కొనసాగించింది. గంటకు 12 కి.మీ వేగంతో లోతట్టు ప్రాంతాలకు కదులుతోంది.
తుపాన్ తెలంగాణ(Telangana) మీదుగా ఉత్తర-వాయువ్య దిశగా కదులుతుందని, బుధవారం మధ్యాహ్నం నాటికి ఛత్తీస్గఢ్ సమీపంలో తుఫానుగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గంటకు 85 నుండి 95 కి.మీ వేగంతో అనేక ప్రాంతాలను బలమైన గాలులు తాకాయి. తుఫాను ప్రభావంతో, తీరప్రాంత ఆంధ్రప్రదేశ్ అంతటా భారీ వర్షాలు నమోదయ్యాయి. గత 12 గంటల్లో నెల్లూరు జిల్లాలోని కావలిలో అత్యధికంగా 23 సెం.మీ వర్షపాతం నమోదైంది. మొంథా తుఫాన్ ప్రభావం, భారీ వర్షాలతో ఏపీలో విద్యాసంస్థలకు(AP Educational institutions) ఈ నెల 31 వరకు సెలవులు పొడగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొంథా తుఫాన్ కారణంగా ఉపాధి కోల్పోయిన మత్స్యకారుల ఒక్కో కుటుంబానికి ప్రభుత్వం 50 కేజీల చొప్పున బియ్యం సాయం చేస్తోంది. భారీ వర్షాలతో కాకినాడలో పునరావాస కేంద్రాల వద్ద పరిస్థితి దయనీయంగా మారింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల జనాలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.




