calender_icon.png 23 December, 2025 | 2:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ ఉద్యోగులకు 17.651 శాతం డీఏ ఖరారు

23-12-2025 12:23:02 AM

  1.   71,387 మందికి ప్రయోజనం 
  2. ప్రతి నెలా రూ. 9.39 కోట్ల అదనపు భారం
  3. ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన డిప్యూటీ సీఎం  

హైదరాబాద్, డిసెంబర్ 22 (విజయక్రాంతి) : విద్యుత్ ఉద్యోగులకు 17.651 శాతం డీఏ ఖరారు చేస్తూ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు రూపొందించిన ప్రతిపాదనలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆమోదం తెలిపారు. బహిరంగ మార్కెట్‌లో పెరుగుతున్న ధరల సూచి ఆధారంగా ప్రతి సంవత్సరం జనవరి, జులై నెలలో డియర్ నెస్ అలవెన్స్/డియర్ నెస్ రిలీఫ్‌ను సమీక్షిస్తూ విడుదల చేస్తారు. అందులో భాగంగా ఈ సంవత్సరం జులై1- నుంచి అమలయ్యేలా ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు డీఏ/డీఆర్ ను 17.651 శాతంగా ఖరారు చేశారు.

తాజా ఉత్తర్వులతో విద్యుత్ సంస్థల పరిధిలోనికి 71,387 వేల మంది ఉద్యోగులు, ఆర్టిజెన్లు, పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు.పెంచిన డీఏ ప్రకారం టీజీ ట్రాన్స్‌కోలో 3,036 మంది ఉద్యోగులకు, 3,769 మంది ఆర్టిజన్లకు, 2,446 మంది పెన్షనర్లకు మొత్తంగా 9,251 మందికి లబ్ది చేకూరనుంది. జెన్ కో విషయానికి వస్తే 6,913 మంది ఉద్యోగులకు 3,583 మంది ఆర్టిజన్లకు, 3,579 మంది పెన్షనర్లకు లబ్ది జరగనుంది.

ఎస్పీడీసీఎల్ లో 11,957 మంది ఉద్యోగులకు 8,244 మంది ఆర్టిజన్లకు, 8,244 మంది పెన్షనర్లకు లబ్ది జరగనుంది. ఎన్పీడీసీఎల్ పరిధిలో 9,728 మంది ఉద్యోగులకు 3,465 మంది ఆర్టిజన్లకు, 6,115 మంది పెన్షనర్లకు లబ్ది జరగనుంది. మొత్తంగా ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లు కలిపి 71,387 మందికి లబ్ది చేకూరనుంది.