3 September, 2026 | 2:17 PM

ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నివారించాలి

19-05-2024 | 01:30am

సీఎంకు బీజేపీ ఎమ్మెల్యేల వినతి

హైదరాబాద్, మే 18 (విజయక్రాంతి): ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నివారించాలని సీఎం రేవంత్‌రెడ్డిని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కోరారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 45 రోజులు అవుతున్నా విక్రయాలు జరగకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. సచివాలయంలో బీజేపీ ఎమ్మెల్యేలు రామారావుపటేల్, పైడి రాకేశ్‌రెడ్డితో కలిసి రేవంత్‌కు శనివారం వినతిపత్రం అందించారు.

లారీలు, హమాలీలు, గన్నీ బ్యాగుల కొరత ఉందని తెలిపారు. అకాల వర్షాలతో చాలా చోట్ల ధాన్యం తడిసిందని చెప్పారు. తడిసిన ధాన్యాన్ని తేమ పేరుతో తూకం వేయకుండా తిరస్కరించడం రైతులను దోచుకోవడమే అవుతుందన్నారు. రైతులు రోడ్డెక్కే పరిస్థితికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని తమ వినతి పత్రంలో పేర్కొన్నారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ప్రకారం క్వింటాలు వరికి రూ.500 బోనస్ చెల్లించాలన్నారు.