బేబీ మౌనికకు న్యాయం చేయాలి
కొవ్వొత్తుల ర్యాలీలో రజక సంఘం నాయకుల డిమాండ్
తాడ్వాయి, ఫిబ్రవరి, 25(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో బేబీ మౌనిక మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, మౌనికకు న్యాయం చేయాలని రజక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో మంగళవారం రాత్రి రజక సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీని కొనసాగించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. నాగర్ కర్నూల్ జిల్లాలో కుమ్మెర గ్రామంలో జరిగిన దారుణ సంఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. అగ్రకుల రెడ్ల దాడిలో బలైన మౌనికకు ఆత్మ శాంతి చేకూరాలని మౌనం పాటించారు. ఈ దాడిలో పాల్పడ్డ రెడ్లను కఠినంగా శిక్షించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.




