21-11-2025 06:16:22 PM
మాలమహానాడు నాయకుల పిలుపు
హుస్నాబాద్: మాలల హక్కుల సాధన, వర్గీకరణ విధానాలను నిరసిస్తూ నవంబర్ 23న సరూర్ నగర్ లో 'మాలల రణభేరి బహిరంగ సభ' నిర్వహించనున్నట్టు మాల మహానాడు నాయకులు తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ సభను విజయవంతం చేయాలని కోరుతూ శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని అంబేద్కర్ చౌరస్తాలో ‛‛హలో మాల చలో హైదరాబాద్" నినాదంతో ఉన్న పోస్టర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు, ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో డిమాండ్లను సంధించారు. సుప్రీంకోర్టు సూచనలకు విరుద్ధంగా, 2011 జనాభా లెక్కలతో సరైన ఎంపరికల్ డేటా లేకుండా కులాల వారీగా చేసిన ఎస్సీ వర్గీకరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రోస్టర్ పాయింట్ల కేటాయింపును పునః సమీక్షించి జీవో 99ను సవరించడం ద్వారా మాలలతో పాటు గ్రూప్-3లో ఉన్న మరో 25 కులాలకు న్యాయం చేయాలని కోరారు.
చేవెళ్ల డిక్లరేషన్ ప్రకారం ప్రస్తుత జనాభాకు అనుగుణంగా ఎస్సీల రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న ఎస్సీ విద్యార్థుల స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మాల కార్పొరేషన్ను ఏర్పాటు చేసి, దాని కోసం రూ.వెయ్యి కోట్ల నిధులను కేటాయించాలని కోరారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులపై శ్వేతపత్రం విడుదల చేసి, నిధులను ఖర్చు చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.