21-11-2025 05:16:16 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని హెల్త్ సూపర్వైజర్ రోజా సూచించారు. శుక్రవారం సుల్తానాబాద్ పట్టణంలోని స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో గర్రెపల్లి పీహెచ్సీ డాక్టర్ ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్త్ సూపర్వైజర్ రోజా మాట్లాడుతూ... మత్తు పదార్థాలు యువత భవిష్యత్తును చెడగొట్టే విధంగా ప్రభావం చూపుతాయని, విద్యార్థులు ఇటువంటి దుష్ట అలవాట్లకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
మత్తుపదార్థాల వల్ల శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని, అలవాటు పడితే చదువు, జీవిత లక్ష్యాలు దెబ్బతినే ప్రమాదం ఉందని విద్యార్థులకు వివరించారు. పాఠశాల విద్యార్థులు ఈ అవగాహన కార్యక్రమంలో చురుకుగా పాల్గొని మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. సమాజం అభివృద్ధి కోసం విద్యార్థులు ఆరోగ్యంగా ఎదగాలని, ఇలాంటి కార్యక్రమాలు మరింతగా నిర్వహించనున్నట్టు పాఠశాల ప్రిన్సిపల్ కృష్ణప్రియ తెలిపారు.