అక్రమ నిర్మాణాల కూల్చివేత
రాజేంద్రనగర్, జూన్ 13 : నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదని నార్సింగి మున్సిపాలిటీ కమిషనర్ ప్రవీణ్కుమార్రెడ్డి హెచ్చరించారు. గురువారం మున్సిపాలిటీ పరిధిలోని 111 జీవో పరిధిలోకి వచ్చే భూముల్లో చేపట్టిన నిర్మాణాలను తనిఖీ చేసి అక్రమ నిర్మాణాలపై కొరడా ఝులుపించారు. హెచ్ఎండీఏ, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అనుమతులు లేని భవనాలను కూల్చివేశారు. గౌలిదొడ్డిలో 111 జీవో అమల్లో ఉన్నందున తులసీ లేఔట్లోని ప్లాట్ నెంబర్ 12, సర్వే నెంబర్ 220, వట్టినాగులపల్లి శంకర్హిల్స్లోని సర్వే నెంబర్ 96, 97 లలో నిర్మాణాలను పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేశారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టే నిర్మాణాలను సహించబోమని హెచ్చరించారు. అక్రమ నిర్మాణాలను తమ దృష్టికి తీసుకురావాలని స్థానికులను కోరారు.






