27 April, 2026 | 4:03 AM

జావేద్ కుటుంబానికి డిప్యూటీ సీఎం భట్టి భరోసా

27-04-2026 02:21 AM

దివంగత నేత నివాసానికి వెళ్లి పరామర్శించిన డిప్యూటీ సీఎం

పిల్లల చదువులకు పూర్తి 

సహకారం అందిస్తామని హామీ

ఖమ్మం, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): ఖమ్మం నగర కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు , దివంగత నేత మహమ్మద్ జావేద్ కుటుంబానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కొండంత అండగా నిలిచారు. ఆదివారం ఖమ్మం నగరంలోని రెడ్ హిల్స్ హౌసింగ్ సొసైటీలో గల దివంగత నేత జావేద్ నివాసానికి వెళ్లిన ఆయన, తొలుత జావేద్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు.

పరామర్శలో భాగంగా జావేద్ ఇద్దరు కుమార్తెలతో భట్టి విక్రమార్క ప్రత్యేకంగా మాట్లాడారు. వారి చదువుల గురించి ఆరా తీశారు. సివిల్స్ కోసం సిద్ధమవుతున్న పెద్ద కుమార్తె మహమ్మద్ షహేలా జావేద్ తో మాట్లాడిన డిప్యూటీ సీఎం.. పట్టుదలతో చదివి లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. సివిల్స్ ప్రిపరేషన్కు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. అలాగే ఎంబీబీఎస్ చదువుతున్న చిన్న కుమార్తె మదిహ సభాహత్ విద్యా వివరాలను అడిగి తెలుసుకున్నారు. ‘మీ భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత మాది‘ అని వారికి భట్టి భరోసానిచ్చారు.

తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు:

ఉప ముఖ్యమంత్రి వెంట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, మాజీ డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ తదితరులు ఉన్నారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన నేతను కోల్పోవడం తీరని లోటని నాయకులు పేర్కొన్నారు. ఈ పరామర్శలో పలువురు స్థానిక నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.