18-05-2025 09:11:22 PM
కోదాడ: అనంతగిరి మండల పరిధిలోని త్రిపురవరం గ్రామంలో అక్రమంగా అనుమతులు లేకుండా గిద్దెకుంట చెరువు నుండి తరలిస్తున్న మట్టి వాహనాలను గ్రామస్తులు అడ్డుకున్నారు. రోడ్డు పనుల పేరుతో మట్టిని దళారులు వాణిజ్య అవసరాలకు తరలిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. రెవెన్యూ అధికారులు అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్న వారికి వత్తాసు పలుకుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఓ మాజీ ఎమ్మెల్యే కుమారుడు కాంట్రాక్టర్ కావడంతో అనుమతులు లేకుండానే మట్టిని తరలిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. పోలీస్ రెవెన్యూ అధికారులు అనుమతులు లేకపోయినా ఉన్నాయని గ్రామ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని చెరువు మట్టిని వివిధ అవసరాలకు గ్రామానికి ఉపయోగపడే విధంగానే ఉపయోగించాలని మట్టిని తరలించడం ద్వారా రానున్న రోజుల్లో గ్రామ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటామని తెలియజేశారు.