చలివేంద్రం కుండల ధ్వంసం
ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు
భిక్కనూర్, ఏప్రిల్ 8(విజయక్రాంతి): భిక్కనూర్ మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తా వద్ద వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన చలివేంద్రం వద్ద అపరిచితుల దుశ్చర్య కలకలం రేపింది. గురువారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ ఉంచిన నీటి కుండలను ధ్వంసం చేయడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పట్టణానికి చెందిన 14వ వార్డు సభ్యుడు జ్ఞాన ప్రకాశ్ రెడ్డి, కౌసల్య దేవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో పలు ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఈ సేవా కార్యక్రమాన్ని పలువురు అభినందించారు. అయితే కొందరు వ్యక్తులు ఈ కార్యక్రమాలను వ్యతిరేకిస్తూ ఇలాంటి ధ్వంసక చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
విషయం తెలుసుకున్న జ్ఞాన ప్రకాశ్ రెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్రంగా స్పందిస్తూ, ప్రజల కోసం చేస్తున్న సేవా కార్యక్రమాలను అడ్డుకోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరుతున్నారు.




