27-09-2025 11:36:44 AM
స్థానిక సంస్థల ఎన్నికలలో బిసి లకు 42 శాతం రిజర్వేషన్లు
రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం హర్షణీయం
దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): ప్రజలకు మంచి చేయాలని సంకల్పంతో ప్రజాపాలన ప్రభుత్వం ముందు నుంచి అడుగులు వేస్తుందని... మాయమాటలను పక్కనపెట్టి మంచి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని దేవరకద్ర(Devarakadra MLA ) ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవోను విడుదల చేయడం జరిగిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం బిసిల పట్ల నిజమైన చిత్త శుద్ది తో ఉందని, వారిని రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాలలో అభివృద్ధి చేయాలన్న చిత్తశుద్ధి ప్రజా పాలన ప్రభుత్వానికి ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వర్గం బిసి రిజర్వేషన్లు అమలు కోసం అహర్నిశలు కృషి చేశారని పేర్కొన్నారు. బిసి సమాజం పక్షాన, కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమలు చేసేందుకు కృషి చేసిందన్నారు. దేశంలో ఒక పకడ్బందీగా, కుల గణన చేపట్టి, బీసీ కమిషన్ వేసి అన్ని రకాలుగా సాంకేతికంగా సమాచారాన్ని సేకరించి రిజర్వేషన్లు అమలు చేసేందుకు జీవో ఇచ్చిందని పేర్కొన్నారు.