వనదేవతలకు మొక్కులు సమర్పించేందుకు తరలివస్తున్న భక్త‘కోటి’
మేడారం (విజయక్రాంతి): ఇలవేల్పు దేవతలకు మొక్కులు సమర్పించడానికి భక్తకోటి శుక్రవారం గద్దెల ప్రాంగణానికి చీమలదండులా బయలుదేరారు. గురువారం రాత్రి సమ్మక్క తల్లి గద్దెను అధిష్టించిన మరుక్షణం నుండే మొక్కులను భక్తులు సమర్పించుకునేందుకు గద్దెలకు క్యూ కట్టారు.
నిర్విరామంగా భక్తుల దర్శన కార్యక్రమం కొనసాగుతోంది. శుక్రవారం పూర్తిగా వనదేవతలంతా భక్తుల మొక్కులు తీర్చుకోవడానికి గద్దెలపైన ఆశీనులు కావడంతో జాతరలో మొక్కులు సమర్పించుకోవడానికి భక్తులు అమిత ఆసక్తి చూపిస్తారు. దీనితో శుక్రవారం మేడారం(Medaram Maha Jatara) గద్దెల ప్రాంగణం పూర్తిగా భక్తకోటితో నిండిపోయింది. లక్షల మంది భక్తులు వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించి తిరుగు ముఖం పడుతున్నారు. మేడారం గద్దెల ప్రాంగణం జాతర ప్రధాన రహదారులు పూర్తిగా భక్తులతో కిక్కిరిసిపోయాయి.






