ధరణితోనే అనేక భూ సమస్యలు
- వాటిపైనే ఎక్కువ ఆర్జీలు వచ్చాయి
- ప్రభుత్వ సలహాదారు వీ హనుమంతరావు
హైదరాబాద్, ఆగస్టు 25 (విజయక్రాంతి): గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణితో రాష్ట్రంలో భూ సమస్యలు వచ్చాయని ప్రభుత్వ సలహాదారుడు వి.హనుమంతరావు విమర్శించారు. బుధవారం గాంధీభవన్లో ప్రజలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో వీహెచ్ పాల్గొన్నారు. ప్రజలు, కార్యకర్తల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రగతి భవన్ను కట్టి ప్రజల సమస్యలను చెప్పుకోవడానికి అవకాశాలు ఇవ్వలేదని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రగతి భవన్ను ప్రజా భవన్గా మార్చి ప్రజా సమస్యల పరిష్కార కేంద్రంగా మార్చారని తెలిపారు. గాంధీభవన్ కూడా ప్రజల సమస్యల పరిష్కార వేదిక అయ్యేలా ముఖాముఖీ కార్యక్రమం చేపట్టారని చెప్పారు. భూములకు సంబంధించిన సమస్యలే ఎక్కువగా తన దృష్టికి వచ్చినట్లు వీహెచ్ తెలిపారు. నాడు ఇందిరా గాంధీ పంచిన భూములను మళ్లీ భూస్వాములు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని తెలిపారు.
రిజిస్ట్రేషన్ ఆఫీసులో తప్పిదాలు జరుగుతున్నాయని.. రెవెన్యూ శాఖ మంత్రి పటిష్ట చర్యలు తీసుకోవాలని వీహెచ్ సూచించారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్తో నరేంద్ర మోదీ నాలుగోసారి ప్రధాని అవ్వాలని చూస్తున్నారని వీహెచ్ అన్నారు. తాము వన్ నేషన్ వన్ ఎలక్షన్కు వ్యతిరేకమని వీహె చ్ అని స్పష్టం చేశారు. భారత్ సెక్యులర్ దేశమని.. ఇక్కడ వన్ నేషన్ వన్ ఎలక్షన్ సాధ్యం కాదని చెప్పారు.






