మూత్రం రంగు మారిందా!
సాధారణంగా ప్రతి మనిషి జీవితంలో రోజువారి జరిగే కొన్ని విషయాలను పెద్దగా పట్టించుకోరు. చూసి చూడనట్టుగానే వదిలేస్తారు. కొన్నిసార్లు ఈ విధమైన ఆలోచన ధోరణి పెను ప్రమాదాలకు కూడా దారితీయొచ్చు. సహజంగా జ్వరం? నడుం నొప్పి? అన్నం తినడం ఇష్టం లేకపోయినా? వైద్యులు రక్త పరీక్షలతో పాటు మూత్ర పరీక్ష కూడా చేయిస్తారు. ఎందుకో తెలుసా? మూత్ర పరీక్ష ద్వారా ఎలాంటి సమస్య ఉందో ఇట్టే తెలిసిపోతుంది. మనం సాధారణంగా విసర్జించే మూత్రం తెల్లగా, లేత పసుపు రంగులో ఉంటుంది. పసుపు, ఎరుపు రంగుల్లో ఉంటే తప్పనిసరిగా అనుమానించాల్సిందేనని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. కిడ్నీ, కాలేయానికి సంబంధించిన వ్యాధులు మూత్రంలో వచ్చే మార్పుల ద్వారా బయటపడతాయి. కిడ్నీ వ్యాధి లక్షణాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయించుకోవాల్సిన పరీక్షల గురించి ప్రముఖ నెఫ్రాలజిస్టు అరుణ్ కుమార్ చెప్తున్న సూచనలు, సలహాలేంటో తెలుసుకుందాం..!
మన శరీరం నుంచి వ్యర్థాలు మలమూత్రం, చెమటల రూపంలో బయటకు వెళ్లిపోతాయి. అయితే మన ఆరోగ్యం ఏ రకంగా ఉంది? మనం ఏమైనా వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉందా? అని ఈ వ్యర్థాలు ముందుగానే సంకేతాలు ఇస్తుంటాయి. అందులో ముఖ్యంగా మూత్రం రంగు అనేక వ్యాధులకు సంకేతం కావొచ్చు. కొందరు వ్యక్తులు తరచుగా మూత్రం రంగు మారడం వల్ల వ్యాధి బారిన పడతామేమో అని ఆందోళన చెందుతుంటారు. అయితే మూత్రం రంగు మారిన ప్రతిసారీ అది వ్యాధికి సంకేతం కాకపోవచ్చు. అనేక రకాల ఆహారపదార్థాల నుంచి వచ్చే రసాయనాలు కూడా మూత్రం రంగును మార్చడానికి కారణమవుతాయి. ఉదాహరణకు బీట్రూట్, బెర్రీలు, బీన్స్ వీటి ద్వారా మూత్రం రంగు మారుతుంది. కొన్ని మందులు కూడా మూత్రం రంగు మారడానికి కారణం కావొచ్చు.
మూత్రం రంగులో అసాధారణమైన మార్పు ఉంటే మాత్రం అది ఏదో ఒక వ్యాధికి సంకేతం. కాలేయం, మూత్రపిండాలు, మధుమేహం వంటి వ్యాధులను గుర్తించడానికి మూత్ర పరీక్ష చేస్తారు. దీంతో పాటు మూత్ర పిండాల సమస్యను కూడా దీని ద్వారా గుర్తించవచ్చు. సాధారణంగా మూత్రం రంగు తాగునీటిపై ఆధారపడి ఉంటుంది. నీళ్లు మూత్రంలో పసుపు వర్ణద్రవ్యాన్ని పలుచన చేస్తాయి. కాబట్టి మీరు ఎంత ఎక్కువ నీరు తాగితే మూత్రం రంగు స్పష్టంగా ఉంటుంది. నీళ్లు తక్కువగా తాగితే మూత్రం పసుపుతో పాటు చిక్కగా మారుతుంది. అయితే కొన్నిసార్లు మూత్రం రంగు సాధారణం కంటే చాలా ఎక్కువగా మారుతుంది. ఇది ఎరుపు, ఆకుపచ్చ, నీలం, ముదురు గోధుమ రంగు తెలుపు కావచ్చు. మూత్ర నాళంలో ఇన్ఫెక్షన్ ఉంటే లేదా కిడ్నీలో రాళ్లు ఉంటే.. మూత్రం రంగు మారుతుంది.
సమస్య ఉన్నట్టు అయితే మూత్రం పోసేటప్పుడు నొప్పి ఉంటుంది. కానీ నొప్పి లేకుంటే మూత్రంతో పాటు రక్తం కూడా వస్తే ప్రమాదానికి సంకేతంగా భావించాలి. ఇది హైపర్ కాల్సెమియా లేదా బ్లూ డైపర్ సిండ్రోమ్. మూత్రం రంగు ముదురు లేదా నారింజ రంగులో ఉంటే.. అది అనేక సమస్యలకు దారితీస్తుంది. కొన్నిసార్లు మూత్రం రంగు ముదురు గోధుమ లేదా నలుపు రంగులో ఉంటుంది. దీన్ని మెలనోమా ప్రారంభ దశగా గుర్తించవచ్చు. కిడ్నీ సమస్య వివిధ కారణాల వల్ల వస్తుంది. వాటికి చికిత్స చేయకుండా వదిలేస్తే కిడ్నీలపై ప్రభావితం పడుతుంది. జ్వరం, వికారం, తీవ్రమైన నొప్పి, మూత్రంలో రక్తం పడటం వంటి లక్షణాలు మూత్రపిండాల్లో రాళ్ల ఉన్నాయనటానికి సాధారణ సంకేతాలు. ఈ లక్షణాలను గమనించినట్లయితే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. మందులు, శస్త్ర చికిత్స, కొన్ని ఆహార మార్పుల వల్ల కూడా కిడ్నీలపై ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
ఏమి తినకూడదు?
- కిడ్నీ సమస్య ఉన్నవారు ఆహారంలో ఉప్పు తీసుకోవడం తగ్గించాలి.
- ఫ్యాక్ట్ ఫుడ్, టొమాటో జ్యూస్, ఫాస్ట్ ఫుడ్స్లో ఎక్కువ మొత్తంలో ఉప్పు ఉంటుంది. అలాంటి వాటిని తినకూడదు.
- కిడ్నీలో రాళ్లు ఉన్నవారు కాఫీ, టీలు ఎక్కువగా తీసుకోరాదు. శీతల పానీయాలలో ఫాస్పోరిక్ యాసిడ్ ఉంటుంది. ఇది కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటానికి కారణం అవుతుంది. కాబట్టి శీతలపానీయాలను నివారించాలి.
- ఆక్సలేట్, విటమిన్ సి ఉన్న ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది. చాక్లెట్, టొమాటో, బచ్చలికూర, తృణధాన్యాలు మొదలైన వాటిలో ఆక్సలేట్ ఉంటుంది. ఇలాంటి వాటిని తినకుండా ఉండటం మేలు.
- ఉసిరి, సోయాబీన్, టొమాటో గింజలు, బెండకాయలు, ఉసిరికాయలు, ఎండు బీన్స్, పచ్చి బియ్యం, ఉసిరి పప్పు, సపోటా, గుమ్మడికాయ, శెనగలు ఎక్కువగా తీసుకోకూడదు.
- నాన్ వెజ్లో అధిక మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది. కిడ్నీ స్టోన్ సమస్య ఉన్నవారు నాన్ తీసుకోవడం తగ్గించడం మంచిది. తక్కువ ప్రోటీన్ ఆహారాన్ని తీసుకోవాలి. ఏం తినాలి?
- కొబ్బరి నీళ్లలో పీచు అధిక స్థాయిలో ఉంటుంది. కిడ్నీలో రాళ్లను నివారించడంలో ఈ పీచు తోడ్పడుతుంది.
- పప్పు దినుసులతో కూడిన కూరగాయలు తినడం వల్ల మేలు కలుగుతుంది.
- బఠానీలు, యాపిల్స్, పాలకూర, బెర్రీలను ఆహారంలో చేర్చుకోవాలి.
- చెరకు కరసం, దానిమ్మ రసం మూత్రపిండాల్లో రాళ్లను నివారించడంలో సహాయపడతాయి. జాబిలి వ్యాధి లక్షణాలు
- మూత్రంలో రక్తం రావడం, అదే పనిగా మూత్ర విసర్జనకు వెళ్లడం, మూత్ర విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి రావటం.
- కిడ్నీలు దెబ్బతిన్నప్పుడు, క్యాన్సర్ ఆనవాళ్లు ఉన్నప్పుడు మూత్రం ఎరుపు రంగులో వస్తుంది. తరచుగా మూత్రంలో రక్తం కూడా వస్తుంది.
- మూత్రం ముదురు గోధుమ రంగులో వస్తున్నప్పుడు కాలేయ సమస్య ఉన్నట్లు గుర్తుంచుకోవాలి.
- మూత్రం పాలలాంటి నురగతో వస్తుంటే మూత్ర వ్యవస్థలో ఎక్కడో ఇన్ఫెక్షన్ సమస్య ఉందని అర్థం.
- బీట్రూట్, స్ట్రాబెర్రీ లాంటి పండ్లు తిన్నప్పుడు కూడా మూత్రం ఎరుపు రంగులో కనిపిస్తుంది. ఇలాంటప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు.
- మూత్రం పచ్చగా వస్తే వేడి చేసిందని కామెర్లు సోకాయని అనుకుంటాం. నిజానికి పసుపు రంగు కామెర్లు వచ్చాయని తెలిసిపోతుంది. బీ కాంప్లెక్స్ విటమిన్లు తీసుకున్నప్పుడు మూత్రం పసుపు రంగులో వస్తుంది.






