23-12-2025 09:25:07 PM
మంచిర్యాల,(విజయక్రాంతి): మంచిర్యాల పట్టణంలోని కార్మెల్ పాఠశాల విద్యార్థులు మంగళ వారం హాజీపూర్ మండలం ర్యాలీ గడ్ పూర్ గ్రామపంచాయతీ పరిధిలోని బాబర్ నగర్ ప్రాంతంలోని సుమారు 40 మంది నిరుపేద కుటుంబాలకు దుప్పట్లు, నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. విద్యార్థులు తాము సేకరించిన నిధులతో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ సారూప్య, ఉప ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ సీమ, సిస్టర్ సోఫీ, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో బాబా నగర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సిస్టర్ మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే నిజమైన మానవత్వం అని, తోటి వారు కష్టాల్లో ఉంటే ఆదుకోవడానికి మనము ఉన్నామనే భరోసా కల్పించడం, విద్యార్థుల్లో చిన్నతనం నుండే పేదవారికి సహాయం చేయడం, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం నేర్పించాలన్నారు. అదే విధంగా గ్రామ ఉపసర్పంచ్ బేర వెంకటేష్ మాట్లాడుతూ... పేదలకు నిత్యవసర సరుకులు, దుప్పట్లు పంపిణీ చేయడానికి మా గ్రామాన్ని ఎన్నుకోవడం చాలా సంతోషమన్నారు. నిరుపేదలను గుర్తించి వారికి సహాయం చేయాలనే సంకల్పం చాలా గొప్పదన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మునిగంటి స్వప్న, ఉప సర్పంచ్ బేర వెంకటేష్, మాజీ ఎంపిటిసి జాలే రాజలింగు, వార్డ్ మెంబర్ జలా భవాని, గ్రామ అధ్యక్షుడు జీల మల్లేష్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.