26-08-2025 10:20:01 AM
సర్వేయర్ ను అడ్డుకున్న బాధిత రైతులు
జయశంకర్ జిల్లా చిట్యాల మండలంలో ఘటన
చిట్యాల (విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలని ఏలేటి రామయ్యపల్లి రైతులు వేడుకుంటున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) చిట్యాల మండలంలోని కైలాపూర్ శివారులోని 190వ సర్వే నెంబర్ లో ఉన్న 16 ఎకరాల 4 గుంటల భూమిని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు నకిలీ పట్టాలు సృష్టించుకొని అక్రమంగా సర్వే చేయిస్తుండటంతో బాధిత రైతులు వారిని అడ్డుకున్నారు. భూమికి సంబంధించిన 20 మంది బాధిత రైతులు మాట్లాడుతూ... 1963 నుంచి తమ తాత ముత్తాతల కాలం నుంచే భూమిని సాగు చేసుకుంటున్నామని తెలిపారు. నవాబుపేట గ్రామానికి చెందిన కొందరు పట్టాలు సృష్టించి తమను బెదిరిస్తూ ప్రతి సంవత్సరం సర్వే చేయిస్తున్నారని వాపోయారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్, ఆర్డీఓకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తమకు సమాచారం ఇవ్వకుండానే దౌర్జన్యంగా కొలతలు వేయడం సరికాదని అన్నారు.జిల్లా సర్వేయర్ గణేష్ జాదవ్ మాట్లాడుతూ..జిల్లా అధికారుల ఆదేశాల మేరకే సర్వే చేస్తున్నామని,గతంలో రెండుసార్లు ప్రయత్నించగా రైతులు అడ్డుకున్నారని తెలిపారు.ఈ విషయంపై రైతులకు ఏమైనా ఆధారాలు ఉంటే జిల్లా కలెక్టర్ ను సంప్రదించాలని సూచించారు. కాగా,కొంత సమయం ఇస్తే కలెక్టర్ కు ఫిర్యాదు చేసి తమ ఆధారాలు చూపిస్తామని బాధిత రైతులు కోరగా,సర్వేయర్ అందుకు అంగీకరించారు. రైతులు కణుకుల అంజిరెడ్డి,లక్ష్మారెడ్డి, రాంరెడ్డి,మల్లారెడ్డి,చంద్రారెడ్డి,ఏనుగు రవీందర్ రెడ్డి,విజేందర్,ఏనుగు వజ్రమ్మ, ఏనుగు అనిల్ పాల్గొన్నారు.