14-06-2025 08:41:48 PM
జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్..
ములుగు (విజయక్రాంతి): ములుగు జిల్లాలో వరదలు మొదలగు ప్రకృతి విపత్తులు ఎదుర్కొనేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం సన్నద్ధంగా ఉన్నారని జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్(District SP Shabarish) ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ... రానున్నది వర్షాకాలమైనందున అతిగా వర్షాలు కురిసి లోతట్టు ప్రాంతాలలో హఠాత్తుగా వరదలు ఏర్పడి ముంపుకు గురయ్యే సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అత్యవసర సేవలు అందించేందుకు గాను ములుగు జిల్లాలో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
ములుగు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలలో గల లోతట్టు ప్రాంతాలను,ముంపుకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల ప్రజల సహాయార్థం ఇట్టి బృందాలను ఆయా పోలీస్ స్టేషన్లకు తరలించడం జరుగుతుందని తెలియజేశారు. కావున ముంపు ప్రాంతాల ప్రజలు లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటూ ఏదైనా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నట్లయితే వెంటనే వారి పోలీస్ స్టేషన్లకు లేదా 100కు కాల్ చేసి సమాచారం అందించాలని తద్వారా తక్కువ సమయంలో ప్రజలను ముంపు ప్రాంతాల నుంచి పునరావాస కేంద్రాలకు తరలించడం సులభం అవుతుందని అన్నారు.అలాగే వరదలు ముంచెత్తిన సమయంలో ప్రజలకు ఏ విధంగా సహాయమందించాలనే విషయంపై జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రామప్ప చెరువులో ఆర్ఐ తిరుపతి ఆధ్వర్యంలో డిజాస్టర్ రెస్పాన్స్ బృందం మాక్ డ్రిల్ నిర్వహించారు.