21-10-2025 10:26:04 PM
చేగుంట: దీపావళి పండుగను చేగుంట, మండల పట్టణ ప్రాంతాల ప్రజలు సోమవారం రాత్రి ఘనంగా జరుపుకున్నారు. మిరుమిట్లు గొలిపే కాంతుల నడుమ ఇంటిల్లిపాటి టపాసులు, వివిధ రకాల బాణాసంచాలను పేలుస్తూ ఆనందోత్సహాల మధ్య ప్రజలు దీపావళి వేడుకలను ఎంతో వైభవంగా జరుపుకున్నారు. దీపావళి పర్వదినం సందర్భంగా ఉదయాన్నే ఆలయాల్లో ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తజనులు నూతన వస్త్రాలు ధరించి పెద్ద సంఖ్యలో ఆలయాలకు చేరుకోవడంతో ప్రధాన ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి.
ప్రతి ఇంట్లో మహిళలు దీపాలు వెలిగించి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. వ్యాపార, దుకాణ సముదాయాల యజమాన్యాలు, ప్రైవేట్ కార్యాలయాల యజమానులు తమ కార్యాలయాలను రకరకాల పూలతో, విధ్యుత్ దీ పాలతో అలంకరింపజేసి లక్ష్మిదేవికి పూజలు నిర్వహించారు. చిన్నాపెద్దా తారతమ్యం లేకుండా దీపావళి వేడుకల్లో పాల్గొని టపాసులు పేలుస్తూ సంబురాలను జరుపుకున్నారు. దీపాల వెలుగులతో అమావాస్య చీకట్లను పారద్రోలేలా ప్రజలు దీపావళి వేడుకలను జరుపుకున్నారు.