04-07-2025 12:00:45 AM
రాహుల్గాంధీని ప్రధాని చేయడమే నా లక్ష్యం
మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు హెచ్చరిక
మీనాక్షి నటరాజన్తో మంత్రి కొండా సురేఖతో కలిసి భేటీ
వరంగల్ జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై వివరణ
హైదరాబాద్, జూలై 3 (విజయక్రాంతి) : ‘నేను వెనుకబడిన వర్గాల ప్రతినిధిని.. 44 ఏళ్ల నుంచి నా ఎపిసోడ్ కొనసాగుతూనే ఉంది. ప్రజాబలంతోనే రాజకీయాల్లో కొనసాగుతున్నాను..కేసులకు భయపడే వ్యక్తిని కాను. నేను ఎవరి మీద కామెంట్ చేయను.. నా మీద కామెంట్ చేస్తే ఊరుకోను..’ అని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు హెచ్చరించారు. సొంత పార్టీ నేతలపై ఇటీవల కొండా మురళి చేసిన వ్యాఖ్యలపై పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆయన సతీమణి, మంత్రి కొండా సురేఖతో కలిసి గురువారం ఏఐసీసీ ఇన్చార్జ్ కార్యదర్శి మీనాక్షినటరాజన్తో ఎమ్మెల్యే క్వార్టర్స్లో భేటీ అయ్యారు. వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై వివరించారు. పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు తమపై కావాలని దుష్పచారం చేస్తున్నారని కొండా మురళి దంపతులు మీనాక్షికి ఫిర్యాదు చేశారు.
అనంతరం కొండా మురళి మీడియాతో మాట్లాడారు..జిల్లాలో సొంత పార్టీలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను మీనాక్షికి వివరించామని, అన్ని అంశాలను పరిష్కరిస్తామని సానుకూలంగా చెప్పారని తెలిపారు. తాము ఏ తప్పు చేయలేదని, పార్టీ ఆదేశాలు తప్పకుండా పాటిస్తామన్నారు. తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడబోమని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీని ప్రధాని చేయడమే తమ లక్ష్యమని, సీఎంగా రేవంత్రెడ్డిని మరో పదేళ్లు చూడాలని అనుకుంటున్నట్లు తెలిపారు. బీసీ బిడ్డ పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్కు అండగా నిలుస్తామని కొండా మురళి చెప్పారు.
జిల్లాలో నెలకొన్న పరిస్థితులను మీనాక్షికి వివరించామని మంత్రి కొండా సురేఖ చెప్పారు. తమ కూతురు పొలిటికల్ ఎంట్రీ గురించి మాట్లాడే సమయం కాదని, కానీ తనకు వచ్చే ఎన్నికల్లో పరకాల బరిలో ఉండాలని ఆలోచన ఉదన్నారు.