20-06-2025 12:13:40 AM
హైదరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి): బనకచర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకే సీఎం రేవంత్రెడ్డి సమావేశం నిర్వహించినట్టుందని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు విమర్శించారు. బనకచర్ల ప్రాజెక్ట్పై ప్రభుత్వం బుధవారం అఖిలపక్ష ఎంపీలతో నిర్వహించిన సమావేశంపై హరీశ్రావు గురువారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు.
‘గోదావరిలో 968 టీఎంసీలు తెలంగాణ హక్కు.. వెయ్యి టీఎంసీలు కావాలని చంద్రబాబు అడగడమేంటి? కృష్ణాలో 763 టీఎంసీలు కోసం వాదిస్తుంటే, 500 టీఎంసీలు అడగటమేంటి? ఆంధ్ర జలదోపిడీని అడ్డుకోమంటే సీఎం అబద్ధాలు చెబుతున్నారు. ఏపీ తెలంగాణకు మేలు జరిగేలా ప్రాజెక్టులు రూపొందించాలని కేసీఆర్ చెప్పారు. తెలంగాణను సంప్రదించకుండా నదుల అనుసంధానంపై ముందకెళ్లొద్దని సూచించారు.
గోదావరి జలాలను సాగర్ నుంచి శ్రీశైలంకు తీసుకురావాలని జగన్తో కేసీఆర్ చెప్పారు. సాగర్, శ్రీశైలం ద్వారా అయితే తెలంగాణకు లాభమని కేసీఆర్ భావించారు. జగన్ అంగీకరించ కపోవడంతో ఆ ప్రతిపాదన ముందుకు పోలేదు అని పేర్కొన్నారు. కానీ సీఎం రేవంత్రెడ్డి ఈ విషయాన్ని అఖిలపక్ష సమావేశంలో వక్రీకరించేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు.
జగన్తో ఏ మాట్లాడామో ఎజెండా ఏదైనా ఉంటే బయటపెట్టాలని హరీశ్ రావు సవాలు విసిరారు. బనకచర్ల ప్రాజెక్ట్ కోసం ఆంధ్రప్రదేశ్ ఆరు నెలల నుంచి పనిచేస్తుండగా, మన సీఎం మాత్రం ఈ ప్రాజెక్ట్ ఏ బేసిన్లో ఉందంటూ అమాయకంగా అడగటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
దేవాదుల ఏ బేసిన్లో ఉందో తెలియదనడంతో మరి సీఎం ఏం చేస్తున్నారని హరీశ్రావు ప్రశ్నించారు. సీఎం రేవంత్రెడ్డి నల్లమల్ల బిడ్డ కాదు.. వెకిలి మాటల వెర్రిబిడ్డ అని హరీశ్రావు ఎద్దేవా చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిన ఘటనపై నీటిపారుదుల శాఖ మంత్రిగా ఉత్తమ్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.