నామినేటెడ్ పోస్టుల్లో మహిళలకు 20 శాతం
పార్టీ పదవుల్లో సముచిత స్థానం కల్పించాం
వచ్చే అసెంబ్లీలో 51 మంది మహిళలు ఎమ్మెల్యేలుగా ఉంటారు
పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్
పీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలుగా ఎర్రబెల్లి స్వర్ణ బాధ్యతలు
హైదరాబాద్, మార్చి15 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తున్నదని, వారి కేంద్రంగానే ప్రభుత్వం కొనసాగుతున్నదని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ పేర్కొన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మహిళలకు పోటీచేసే అవకాశం కాంగ్రె స్ పార్టీ కల్పించిందని తెలిపారు. పీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలుగా ఎర్రబెల్లి స్వర్ణ ఆదివారం గాంధీభవన్లో బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మహేశ్కుమార్గౌడ్ మాట్లాడుతూ.. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఆరుగురు మహిళలను నియమించామని, నామినేటెడ్ పదవుల్లో 20 శాతం మహి ళలకు ఇవ్వాలనే ఆలోచనతో సీఎం రేవంత్రెడ్డి ఉన్నారని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 51 మంది మహిళలు ఎమ్మెల్యేలుగా ఉండబోతున్నారని చెప్పారు.
మహిళలను రాష్ట్రపతిని, ప్రధానిని, గవర్నర్లను, స్పీకర్లను, ముఖ్యమంత్రులను చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోనూ మహిళలకు సముచిత స్థా నం కల్పిస్తున్నట్టు వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు.
అభివృద్ధి, సంక్షేమ పథకాలను మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ నేతృత్వంలో కాంగ్రెస్ మహిళా శ్రేణులు గడపగడపకు వెళ్లి ప్రజలకు చేరవేయాలని సూచించారు. పార్టీ తనకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చుతానని కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఐసీసీ మహిళా అధ్యక్షురాలు అల్క లాంబ, సునీతారావు, ఎంపీ కడియం కావ్య, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, నాయకులు గుండు సుధారాణి, కోట నీలిమ, నేరెళ్ల శారధ తదితరులు పాల్గొన్నారు.




