17-06-2025 10:32:01 PM
గురుకుల కార్యదర్శి బి. షఫివుల్లాను కలిసిన యాకూబ్ పాషా..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): రాష్ట్రంలో మైనారిటీ గురుకుల డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎండీ.యాకూబ్ పాషా(Minority Welfare Association President MD. Yakub Pasha) మైనారిటీ గురుకులాల కార్యదర్శి బి.షఫీవుల్లాను హైదరాబాద్ లోని ఆయన కార్యాలయంలో మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 204 మైనారిటీ గురుకుల జూనియర్ కళాశాలల్లో సుమారు 10,000 మంది విద్యార్ధులు ప్రతి ఏటా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసి బయటికి వెళ్తున్నారని, మైనారిటీలకు గురుకుల డిగ్రీ కళాశాలలు లేనందున అనేక మంది విద్యార్ధులు గత ఐదేళ్లుగా ఇంటర్ తర్వాత చదువులతోనే స్వస్తి పలుకుతున్నారన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాష్ట్ర వ్యాప్తంగా 79 గురుకుల డిగ్రీ కళాశాలలున్నాయని, మైనారిటీలకు మాత్రం ఒక్క కళాశాల కూడా లేదన్నారు. దీని కారణంగా గురుకులాలో ఇంటర్ వరకు చదివిన విధ్యార్దులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కావున బాల, బాలికల కొరకు వేర్వేరుగా ఉమ్మడి జిల్లాలలో మైనారిటీ గురుకుల డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేశారు. స్పందించిన గురుకులాల కార్యదర్శి విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తానని తెలిపారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముస్లీం ఉద్యోగుల సంఘం అద్యక్షులు ఎండి ఫారూఖ్, మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.