30-04-2025 10:21:51 PM
కలెక్టర్ కుమార్ దీపక్...
మంచిర్యాల (విజయక్రాంతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి నూతన ఆర్.ఓ.ఆర్. చట్టంను ఇందులో పొందుపరిచిన అంశాలను రైతులు తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak) అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మైనారిటీ ఫంక్షన్ హాల్ (షాది ఖాన)లో భూభారతి నూతన ఆర్.ఓ.ఆర్. చట్టంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, మంచిర్యాల ఆర్ డి ఓ శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు అనిత, తహశిల్దార్ రఫతుల్లా లతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి నూతన ఆర్.ఓ.ఆర్. చట్టం ద్వారా రైతులకు భూమిపై హక్కు, రికార్డులలో తప్పుల సవరణకు అవకాశం కల్పించడం జరిగిందని, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేసే ముందు భూముల పూర్తి వివరాలతో సర్వే చేసి, మ్యాప్ తయారు చేయడం జరుగుతుందని, పెండింగ్ సాదా బైనామా దరఖాస్తులను పరిష్కరించడం జరుగుతుందని, వారసత్వంగా వచ్చిన భూములకు విరాసత్ చేసే ముందు సమగ్ర విచారణ జరిపి పట్టా చేయడం జరుగుతుందని తెలిపారు.
భూమి హక్కులు ఏ విధంగా సంక్రమించినా ముటేషన్ చేసి రికార్డులో నమోదు చేయడం జరుగుతుందని, పాసు పుస్తకాలలో భూమి పటం నమోదు చేయడం జరుగుతుందని, భూ సమస్యల పరిష్కారానికి 2 అంచెల అప్పీల్ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగిందని, భూధార్ కార్డుల జారీ, ఇంటి స్థలాలకు, ఆబాది, వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డు, రైతులకు ఉచిత న్యాయ సహాయం, గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణతో పాటు మోసపూరితంగా హక్కుల రికార్డులు మార్చి ప్రభుత్వ, భూదాన్, అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్ భూములకు పట్టాలు పొందితే రద్దు చేసే అవకాశం వంటి అంశాలను పొందు పర్చడం జరిగిందని తెలిపారు.
భూభారతి నూతన ఆర్.ఓ.ఆర్. చట్టంపై రైతులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక మండలాన్ని ఎంపిక చేసి మండలంలోని అన్ని రకాల సమస్యలను తెలుసుకొని జూన్ 2వ తేదీ వరకు పరిష్కరించడం జరుగుతుందని, సంబంధిత పూర్తి వివరాలతో ప్రభుత్వానికి నివేదిక అందించడం జరుగుతుందని,మిగిలిన మండలాలలోని సమస్యలను గుర్తించి ఆగస్టు 15వ తేదీ లోగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
గ్రామాలలో నెలకొన్న సమస్యలపై దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని, గ్రామస్థాయిలోని సమస్యలపై పూర్తి స్థాయిలో దృష్టిని కేంద్రీకరించి పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామని, రైతులకు పట్టాభూమి, లావుని పట్టా, ఇతర రకాల భూములకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వ ఆదేశాలు, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని, టైటిల్, పొసెషన్ సంబంధిత సమస్యలు, కోర్టులో కొనసాగుతున్న కేసులను మినహాయించి మిగిలిన వాటిని పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి నూతన ఆర్.ఓ.ఆర్. చట్టంలో పొందుపరిచిన అంశాలను రైతు ప్రయోజనం దిశగా పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.