23-07-2025 01:05:16 AM
హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి): స్థానిక సంస్థల్లో 42శాతం రిజ ర్వేషన్ల నుంచి మొదలుకొని బీసీ డిక్లరేషన్ వరకు బీసీలకు అడుగడుగునా మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ వైఖ రి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కులగణన నుంచి ప్రారంభించి, ప్రస్తుత ప్రభుత్వం తీసుకొస్తున్న ఆర్డినెన్స్ వరకు అన్ని స్థా యిల్లోనూ బీసీలను మోసం చేయడమే కాంగ్రెస్ అసలైన లక్ష్యంగా ఉం దని మండిపడ్డారు.
మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో పలువురు బీసీ ప్రజాప్రతినిధులతో జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ అంశంపై విస్తృతంగా చర్చించారు. కాంగ్రెస్ పార్టీ కేవలం బీసీలను మోసం చేయాలన్న దురుద్దేశంతోనే స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల అంశంలో చిత్తశుద్ధి లేకుండా వ్యవహరించిందని కేటీఆర్తోపాటు నేతలు అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ఆమోదం పొందదని తెలిసినా, మరోసారి ఆర్డినెన్స్ పేరుతో కొత్త నాటకానికి కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతోందని వారు పేర్కొన్నారు. కుల గణన జీవో నుంచి గణన ప్రక్రియ వరకు బీసీల సంఖ్యను తగ్గించి చూపడంలో కాంగ్రెస్ దురుద్దేశం స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయకుండా బీసీలకు తీవ్రమైన అన్యాయం చేస్తోందన్నారు. కాంగ్రెస్ చేపట్టిన ప్రతి ప్రక్రియలో ఉన్న లోపాలు లొసుగులు వారికి ముందే తెలిసినా, బీసీలను మోసం చేయాలన్న దురాలోచనతో ఇప్పుడు కోర్టుల పేరుతో, చట్టపరమైన నిబంధనలు చూపిస్తూ తప్పించుకోవడానికి కాంగ్రెస్ రంగం సిద్ధం చేస్తోందన్నారు.
అత్యంత లోపభూయిష్టంగా దురుద్దేశపూర్వకంగా నిర్వహించిన కులగణన సర్వేను జాతీయ రోల్మోడల్ అని చెబుతూ తెలంగాణ ప్రజల్ని మోసం చేయడమే కాకుండా, జాతీయ వేదికలపై అబద్ధాలు చెబుతున్నదని నేతలు మండిపడ్డారు.
ఒకవైపు 42 శాతం రిజర్వేషన్ల అంశంలో బీసీలను మోసం చేస్తూనే బీసీ డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ అమలు చేయకుండా బీసీలను మభ్యపెడుతుందని విమర్శించారు. అంతేకాకుండా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల కోసం ప్రారంభించిన పథకాలను రద్దు చేసి కొత్త పథకాలు ప్రారంభించకపోవడం ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీ వారికి చేస్తున్న ద్రోహమే అన్నారు.