అక్రిడిటేషన్ కార్డులు మరో మూడు నెలల పొడిగింపు
- తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి
ఖమ్మం, జూన్ 18 (విజయక్రాంతి): జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డులను మరో మూడు నెలల పొడిగిస్తున్నట్లు రాష్ట్ర మీడి యా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్రెడ్డి ప్రకటించారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం త్వరలో సరికొత్త విధానాన్ని అమలు చేయబోతున్నదన్నారు. ఖమ్మంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హ త కలిగిన ప్రతి జర్నలిస్టుకు కొత్తగా అక్రిడిటేషన్ కార్డు మంజూరు చేస్తామన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో 24వేల మందికి అక్రిడిటేషన్లు ఇస్తున్నామన్నారు.
అనర్హులకు కార్డులు అందకుండా ఉండేందుకు చర్యలు తీసుకుం టున్నామన్నారు. జర్నలిస్టులు ఇండ్లు, ఇల్ల స్థలాలు, అక్రిడిటేషన్ల సమస్యలను పరిష్కరించాలని అడుగుతున్నారని, వాటన్నింటినీ పరిష్కరించేందుకు సర్కార్ సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వం కొత్తగా అధికారంలోకి రావడం, ఆ తర్వాత శాసనసభ వ్యవహారాలు, లోక్సభ ఎన్నికలు రావడంతో జర్నలిస్టుల సమస్యలపై దృష్టి సారించే సమయం లేకపోయిందని స్పష్టం చేశారు.
ఇప్పటికే ఈ సమస్యలపై తాను రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి శ్రీనివాస్రెడ్డితో చర్చించానన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం విధి, విధానాలు రూపొందించి తన వద్దకు రావాలని మంత్రి సూచించారన్నారు. హెల్త్ కార్డుల విషయంలో ఏర్పడిన సమస్యలన్నింటినీ త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎంపీ పువ్వాడ నాగేశ్వరరావును మర్యాద పూర్వకంగా కలిశారు.
-జర్నలిస్టుల సంక్షేమం కోసం త్వరలో సరికొత్త విధానం
సూర్యాపేట, జూన్18(విజయక్రాంతి): ఖమ్మంలో జరిగిన జర్నలిస్టుల సభకు వెళ్తూ మంగళవారం మార్గమధ్యంలోని సూర్యాపేటలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్రెడి కొద్దిసేపు ఆగారు. స్థానిక జర్నలిస్టులతో ముచ్చటించారు. వారి అడిగిన అనేక సందేహాలను నివృత్తి చేశారు. నాయకులు విరహత్ అలీ, సత్యనారాయణ, రాజేష్, శ్రీనివాస్రావు, నాగేశ్వరరావు పాల్గొన్నారు.






