16-08-2025 01:40:27 PM
పేర్ల నాగయ్య, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ తుంగతుర్తి డివిజన్ కార్యదర్శి
తుంగతుర్తి,(విజయక్రాంతి): గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో తుంగతుర్తి నియోజకవర్గం(Thungathurthi Constituency) లోని అన్ని గ్రామాలలో వరదల వల్ల పంట పొలాలు దెబ్బతిన్నాయని, పంట పొలాల దెబ్బతిన్న రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలని సిపిఐ(ఎం.ఎల్) మాస్ లైన్ తుంగతుర్తి డివిజన్ కార్యదర్శి పేర్ల నాగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత వారం రోజులుగా తుఫాను ప్రభావంతోటి వర్షాలు విపరీతంగా కురుస్తున్నందున, పంట భూములు మొత్తం జలమయం అయినాయని, వరదల వల్ల అనేక మంది రైతుల పొలాలలో ఇసుక మేటలు వేసిందని, చాలా పంట పొలాలు వరద తాకిడికి గురై కొట్టుకపోయినాయని ఆవేదన చెందారు. అప్పు చేసి నాటుకున్న వరి పొలాలు వరద తాకిడికి గురవడంతో రైతుకు దిక్కుతోచక కన్నీటి పర్యంతం అవుతున్నారని అన్నారు.
నష్టపోయిన రైతుల పొలాలను గుర్తించి నష్టపరిహారం చెల్లించి, రైతులను ఆదుకోవాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. స్థానిక ఎమ్మెల్యే కూడా రైతే అయినందున,అన్ని ప్రదేశాల్లో పర్యటించి రైతులకు జరిగిన నష్టాన్ని, వారి ఆవేదననే అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేసినారు. నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం తో పాటు, తిరిగి నాట్లు వేసుకునేందుకు రుణ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేసినారు. అదేవిధంగా వరదల వల్ల అన్ని గ్రామీణ రోడ్లు శిధిలం అయిపోయినాయని, వాటిని వెంటనే మరమ్మతు చేసి రవాణా సౌకర్యం పునరుద్ధరించాలని కోరినారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల మధ్యన కొట్టుకపోయిన వాగులపై వంతెనలను బ్రిడ్జిలను వెంటనే యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలని డిమాండ్ చేసినారు. పై సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే స్పందించాలని, లేనియెడల తమ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించినారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు వేర్పుల లక్ష్మయ్య, నాయకులు , కమటం బుచ్చాలు, కమటం బాబు, ముజ్జిగ వెంకటేష్, నల్లగంటి నరేష్ తదితరులు పాల్గొన్నారు.