16-08-2025 02:42:51 PM
గుడిపల్లి గ్రామాన్ని సందర్శించిన ఎమ్మెల్యే..
వర్షం కారణంగా ఏర్పడిన సమస్యలపై ఆరా..
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పరిధిలోని ప్రధాన కాలువలకు లైనింగ్ పనులు చేపట్టకపోవడం వల్లే తరచూ గండ్లు పడి సమీప రైతుల పంట పొలాలు, ఇండ్లు ధ్వంసం అవుతున్నాయని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచకుళ్ళ రాజేష్ రెడ్డి(MLA Kuchkulla Rajesh Reddy) అన్నారు. శనివారం నాగర్ కర్నూల్ మండల పరిధిలోని గుడిపల్లి గ్రామ 29వ ప్యాకేజీ పరిధిలోని కాల్వను ఆయన పరిశీలించారు. కాల్వ నిండుగా నీరు ప్రవహిస్తుండడంతో లైనింగ్ లేని కారణంగా గ్రామంలోని ఇండ్లు ఊరుస్తున్నాయని పంట పొలాలు సైతం కరిగెటగా మారుతున్నాయని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీంతో వెంటనే అక్కడే ఇరిగేషన్ శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. అవకాశం ఉన్న మేరకు మెత్తబడిన ప్రాంతంలో కాలువల మరమ్మతు పనులు చేపట్టాలని శాశ్వత పరిష్కారం లైనింగ్ పనులు కూడా చేపట్టాలన్నారు. అందుకు ప్రభుత్వంతో కూడా మాట్లాడుతానని పేర్కొన్నారు.