16-08-2025 12:01:38 AM
- లారీని వెనకనుంచి ఢీకొన్న ప్రైవేట్ బస్సు
-ముగ్గురు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం
-మరో 11మందికి తీవ్ర గాయాలు
మహబూబ్ నగర్ (విజయ క్రాంతి) : మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలోని ఎన్ హెచ్ 44 మాచారం ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్కి చెందిన బస్సు , లారీ ఢీకొనడంతో ఈదుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సీఐ కమలాకర్ తెలిపిన వివరాల మేరకు సీజీఆర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, లోడు వేసుకొని లారీ హైదరాబాద్ వైపు వెళుతున్నాయి.
అయితే జడ్చర్ల సమీపంలోకి రాగానే మాచారం బ్రిడ్జి వద్ద బస్సు ఒక్కసారిగా లారీని వెనకనుంచి ఢీ కొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరో పదకొండు మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా జనరల్ ఆస్పత్రి, గాయాలకు గురైన వారిని జడ్చర్ల ఆస్పత్రికి తరలించారు. పూర్తిస్థాయిలో ఘటనకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.