17-08-2025 01:11:49 AM
వలస వచ్చిన వారిని వ్యతిరేకిస్తూ చరిత్రలో జరిగిన ముల్కీ ఉద్యమం, ఇడ్లీ సాంబార్ ఉద్యమాల తరహాలోనే మరో ఉద్యమం మన తెలంగాణ గడ్డపై పురుడు పోసుకున్నదా? లేదా ఎవరైనా ఉద్యమాన్ని రగిల్చారా అన్న అనుమానాలు, సందేహాలు సర్వత్రా కలుగుతున్నాయి. ఎక్కడో సికింద్రాబాద్లో రెండు వర్గాల మధ్య జరిగిన చిన్న తగాదా కాస్త చినికి చినికి గాలివాన అయినట్లుగా పెద్ద ఉద్యమానికే దారితీసింది. అదే ‘మార్వాడీ వ్యాపారస్తులు గో బ్యాక్’ ఉద్యమం.
ఇది హైదరాబాద్ మహానగరంలో పురుడు పోసుకొని, క్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపిస్తోంది. రంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలతోపాటు మరికొన్ని జిల్లాల్లోని మండల కేంద్రాలకు వ్యాపించిందంటే పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఉద్యమంతో రెండు వర్గాలుగా క్షేత్రస్థాయిలో వ్యాపారస్తులు విడిపోయారు. సంఘాలుగా ఏర్పడి నిరసనలను సైతం ఉధృతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.
మార్వాడీ వ్యాపారుల వల్ల తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని, తమ యువకులకు ఉద్యోగాలు లభించడంలేదని స్థానిక వ్యాపారస్తులు ఆరోపిస్తున్నారు. నాసిరకం సరుకులు విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. మొత్తంగా చాపకింద నీరులా ఈ ఉద్యమం పురుడు పోసుకుంటోందనే చర్చ తీవ్రంగా జరుగుతోంది.
సోషల్ మీడియాలో విస్తృతంగా గో బ్యాక్ పోస్టులు దర్శనమిస్తున్నాయి. అయితే ఒక వర్గం వీరికి వ్యతిరేకంగా ఉంటే, మరో వర్గం వీరికి అనుకూలంగా మాట్లాడుతోంది. తెలంగాణ అంటేనే అన్ని కుల, మతాలు, వర్గాల సమ్మేళనమని మేధావులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
* మార్వాడీలు మనలోని వారే. వారిని వెళ్లగొట్టే హక్కు ఎవరికీ లేదు.
పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్
* రాష్ట్రంలో రోహింగ్యాలు లక్షన్నర మంది ఉన్నారు. వారిని వెళ్లగొట్టే విషయంపై మాట్లాడే దమ్ముందా?
బీజేపీ నాయకురాలు మాధవీలత