10-06-2025 12:00:00 AM
ముంబై, జూన్ 9: ముంబైలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. లోకల్ ట్రైన్ నుంచి జారిపడి ఐదుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ముంబై చత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్టీ) నుంచి థానే జిల్లా కేసర ప్రాంతానికి వెళ్తున్న రైలులో ఈ దుర్ఘటన జరిగింది. రైలు రద్దీగా ఉండటంతో కొంత మంది డోర్ల వద్ద నిల్చున్నారు.
అలా డోర్ల వద్ద నిల్చున్న వారిలో కొందరు కిందపడిపోయి దుర్మరణం పాలయ్యారు. మొత్తం 12 మంది వ్యక్తులు జారి కిందపడిపోగా ఐదుగురు మరణించినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
రైల్వే శాఖ కీలక నిర్ణయం
ఈ ప్రమాదం నేపథ్యంలో రైల్వేశాఖ కీలకనిర్ణయం తీసుకుంది. ముంబై సబర్బన్ ప్రాంతంలో నడిచే అన్ని రైళ్లకు ఆటోమేటిక్ డోర్లు ఏర్పాటు చేయనున్నట్టు రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దిలీప్ కుమార్ పేర్కొన్నారు. ప్రయాణికుల భద్రతే రైల్వే శాఖ ప్రథమ ప్రాధాన్యం అని పేర్కొన్నారు.