03-01-2026 12:00:00 AM
టేకులపల్లి, జనవరి 2 (విజయక్రాంతి): టేకులపల్లి పీఏసీఎస్ కార్యాలయాన్ని జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు శుక్రవారం సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. సాగు సీజన్ దృష్ట్యా రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని ఆదేశించారు.పీఏసిఎస్ పరిధిలోని గోదాములను ఉదయం 6 గంటలకే తెరిచి రైతులకు పంపిణీ చేయాలన్నారు. టేకులపల్లి మండల కేంద్రంలో రెండు ఎరువుల దుకాణాల్లో యూరియా అందుబాటులో ఉందని, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు అమ్మాలన్నారు.
జిల్లావ్యాప్తంగా 406 కేంద్రాల ద్వారా ఎరువులు సరఫరా చేస్తున్నామని, ఎవరైనా నిర్ణీత ధర కంటే ఎక్కువకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పీఏసిఎస్ కేంద్రాల పరిధిలోని గోదాముల వద్ద రైతులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అక్కడున్న రైతులతో జిల్లా వ్యవసాయాధికారి మాట్లాడి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఇల్లందు ఏడీఏ లాల్ చంద్, టేకులపల్లి వ్యవసాధికారి అన్నపూర్ణ, పీఏసిఎస్ సిఈఓ పొన్నోజు ప్రేమాచారి, సిబ్బంది పాల్గొన్నారు.